Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-13
క.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮
ఆ.
వారి జాక్షులందు వై వాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగ మందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప.!౫౮౪

ఇందులో మొదటి కంద పద్యం శ్రీమదాంధ్రమహాభారతం లో శర్మిష్ఠ యయాతి మహారాజుతో అంటుంది. రెండవ ఆటవెలది పద్యం వామనావతార ఘట్టంలో శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో అంటున్నది. మొదటిది మునివచనం అని శర్మిష్ఠ అంటుంది. రెండవది శుక్రాచార్యులు స్వయంగా చెప్పిన విషయం. "సత్యం వద " అనే వేదవాక్యానికిదో అపవాదం లాంటిది. దీనినే పెద్దలు శుక్రనీతిగా పరిగణిస్తారు.
శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో దేవయానికి దాసిగా నియమింపబడిన తర్వాత ఓ రోజు యయాతి మహారాజు అడవిలో దాహంతో తిరుగుతున్నపుడు అనిలు డనే దూత చేత దేవయాని దగ్గఱకు తీసుకొని రాబడతాడు. అప్పుడు దేవయానిని గుర్తించి, శర్మిష్ఠ గురించి అడగ్గా ఆమెను వృషపర్వుని పుత్రికగా తన దాసిగా పరిచయం చేస్తుంది. ఇంకా తమ పాత పరిచయాన్ని గుర్తు చేసి యయాతి తన దక్షిణ హస్తంతో దేవయాని దక్షిణ హస్తాన్ని పట్టుకొని రక్షించడం వలన తమ కిద్దరికీ ఇదివరకే పెళ్ళయినట్లే నంటూ తనను పెళ్ళిచేసుకోమని దేవయాని యయాతిని కోరుతుంది. దానికి యయాతి క్షత్రియుడైన తాను బ్రాహ్మణ కన్యను వివాహమాడ్డం ధర్మ విరుద్ధం అంటాడు. పైగా తాను వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడాల్సిన రాజు కాబట్టి అలా పెళ్ళిచేసుకోవటం భావ్యం కాదంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ వివాహం ధర్మ సమ్మతమేనంటే చేసుకుంటావు గదా అని అంటుందామె. అలాగే నంటాడతను. అప్పుడు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి అవివాహంలో అపక్రమదోషం లేకుండా వరమిస్తాడు. అలా వరమిచ్చి వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. శర్మిష్ఠను కన్యకాసహస్రంతో పాటుగా యయాతికి అంపకం పెడుతూ ఆమెకు అన్నపానభూషణాచ్ఛాదనమాల్యానులేపనాదుల సంతోషంబు సేయమని శయనవిషయంబున పరిహరించమని చెప్పి పంపిస్తాడు.
కాలక్రమంలో దేవయాని యందు యయాతికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు.

ఒకనాడు శర్మిష్ఠ సంప్రాప్త యౌవనయు ఋతుమతియు నై దేవయాని అదృష్టాన్ని తలచుకొని ఇలా అనుకుంటుంది.
క.
పతిఁ బడసి సుతులఁ బడయఁగ, నతివలు గోరుదురు గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను, సతులీ భార్గవికి భాగ్యసంపద నెనయే.౧౭౧
తరువోజ.
ఈరాజునంద నాహృదయంబు దవిలియెప్పుడు నుండు నన్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నట్టుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు.౧౭౨

దేవయాని యయాతిని ఎలా వివాహమయ్యిందో అలానే తను కూడా యయాతిని పెళ్ళాడాలనుకుంది శర్మిష్ఠ.
అవకాశం దొరకగానే నన్నేలిన దేవయానికి నీవు భర్తవు కాబట్టి నాకు కూడా నీవు భర్తవే ఆ దేవయానిని పరిగ్రహించినపుడే నేనామె ధనాన్నగుటచే నేనుభవత్పరిగ్రహంబనే అంటుంది. కావున తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమంటుంది. యయాతి ఇలా అంటాడు.
క.
లలితాంగి శయన మొక్కఁడు, వెలిగా రుచిరాన్న పాన వివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము, సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్.౧౭౬
సొలయక=వెనుదీయక
వ.
ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి నెట్లు బొంక నేర్తు ననిన శర్మిష్ఠ యయాతితో పైన చెప్పిన విధంగా అన్నదట.
.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮

చెప్పొచ్చేదేంటంటే
శుక్రనీతి (అవసరార్ధం మార్పుచేసుకొనేది) శుక్రుని కూతురు కాపురానికే ఎసరు పెట్టిందన్నమాట.
క్రమక్రమంగా యయాతి వలన శర్మిష్ఠకు ద్రుహ్యనుపూరులనే ముగ్గురు కొడుకులు యయాతి పోలికలతో పుడతారు.
వారిని చూచి విషయం తెలుసుకొన్న దేవయాని తన తండ్రికి పిర్యాదు చేస్తుంది. శుక్రాచార్యులు కోపించి యయాతికి జరాభారపీడితుండవు కమ్మని శాపమిస్తాడు.
క.
ఋతుమతియై పుత్త్రార్థము, పతిఁ గోరినభార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన, నతనికి మఱి భ్రూణహత్య యగునంఢ్రు బుధుల్.౧౮౮
క.
దానికి భీతుఁడ నై య, మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడిసితి నెదలో, దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా.౧౮౯
వ.
ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను జరాభారంబుఁ దాల్ప నోపనని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి యట్లేని నీముదిమి నీకొడుడులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము నీవు విషయోపభోగతృప్తుండ వైన మఱి నీముదిమి నీవ తాల్చి వాని జవ్వనంబు వానికి నిచ్చునది. నీ ముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీ సహితుం డై తన పురంబునకు వచ్చి శుక్రు శాపంబున జరాభారంబుఁ దాల్చిన వానికి.౧౯౦
క.
తల వడఁక దొడఁగె నింద్రియ, ములగర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును, దలయేరును నుక్కిసయును దలకొనుదెంచెన్.౧౯౧

వళీపలితంబు=ముడుతలు నరయును
వగరును=ఉబ్బసమును
తలయేరును=తలనొప్పియును
ఉక్కిసయును=పొడిదగ్గును