Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-4
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47

కర్ణుడిని కృపాచార్యులు తన తల్లి దండ్రుల వివరాలు చెప్పమన్నప్పుడు దుర్యోధనుడు పై విధంగా అంటాడు.
మ.
జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ

ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్ విరో
చనుం డాత్మ ద్యుతి విస్తరించె సుతుపై సంప్రీత చేతస్కుఁ డై.
40
తత్ జీమూత యూథంబు=ఆ మేఘ సమూహము
తత్ ధ్వాంతతిరోహిత ఆపఘనుఁ డు ఐ=ఆ చీఁకటిచేఁ గప్పఁబడిన శరీరియై
కర్ణు డర్జునుని మీద పర్జన్యాస్త్రమేసాడు.
వ.
అయ్యవసరంబున దుర్యోధనుం దొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి భీష్మద్రోణకృపపాండవులు పార్థువలన నుండి రంత. 41
క.
రవిసుతపార్థులఘోరా, హవమునకును వెఱచు చున్న యది కుంతి తదు
ద్భవ ఘనతరశరతిమిరౌ,ఘ వృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్.
42

కర్ణార్జునుల ఘోరమైన ఈ యుద్ధం చూచి కుంతి మిక్కిలి యధికమగు బాణాంధకారముచేఁ గప్పబడిన దేహుడైన కొడుకును చూడగానక భయపడింది.
క.
ధృతిఁ దఱిఁగి మోహమూర్ఛా,న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా గతజీవఁ జేసె నప్పుడ, యతిశీతలచందనోదకా సేకమునన్. 43

కుంతి ధైర్యాన్ని కోల్పోయినదై మూర్ఛనొందగా వెంటనే విదురుఁడు ఆమెకు శీతలోపచారాలు చేసి ప్రాణం తిరిగి వచ్చిన దాన్నిగా చేసాడు.
వ.
అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవ నేసి యాదిత్యసమతేజుం డయి యున్న విదురదర్శితు లై న యక్కర్ణార్జులం జూచి కుంతి సంతసిల్లె నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వ యుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱనడుమ నిలిచి కర్ణున కి ట్లనియె. 44
చ.
కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుఁడు రాజధర్మ బం
ధుర చరితుండు నీ వితనితోడ రణం బొనరించెదేని వి

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు చెప్పినన్
దొర యగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్. 45
దొర=సాటి
అర్జునుడు కుంతీ పాండురాజుల సంతానం. రాజధర్మా న్నెఱిగిన వాడు. నీ వితనితో ద్వంద్వయుద్ధం చేయాలనుకుంటే నీ తలిదండ్రుల వివరాలు చెప్పు. సాటి వాడవయితె నీపై తన బలాన్నితడు చూపిస్తాడు.
వ.
అనిన విని కర్ణుండు తనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తల వాంచి యున్నం జూచి దుర్యోధనుఁడు గృపున కి ట్లనియె. 46.
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47
తే.
రాజవరు డైన పార్థుతో రాజు గాని, యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని నెల్లవారును జూడంగ నీ క్షణంబ, రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి. 48
వ.
అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడు మను బ్రాహ్మణవచనంబు వడసి కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండు మణిమకుట కేయూరహారాదిభూషణభూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమ హర్షంబు తోడం గురుపతి కి ట్లనియె. 49