Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-విరాట పర్వము
భీముడు వంటలవాఁడై విరటుఁ గొల్వ వచ్చుట
శా.
దేవా నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్
సేవాదక్షత నొండుమై నెఱుఁగ నీచిత్తంబునన్ మెచ్చున
ట్లే వండం గడు నేర్తు బానసమునం దిచ్చోటనే కాదు న
న్నేవీటన్ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులన్ జూచినన్. 217

భీముడు వంటలవాడి వేషంలో విరాటు కొల్వులోనికి ప్రవేశించి విరాట రాజుతో పై విధంగా అంటాడు. నేను శూద్రజాతికి చెందినవాడను. నాపేరు వలలుడు. మీకు వంటలు మంచి రుచిగా వండిపెట్టగలను. ఏవిధంగా చూచినా నన్నుమించిన వంటలవాడు ఎక్కడా కనిపించడు.
చ.
వలసిన నేలు మేను బలవంతుఁడఁ గారెనుఁబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమును లావు విద్య మెయి దర్పముఁ బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విఱుతున్ వడిన్ గడియలోనన చూడ్కికి వేడ్క సేయుదున్. 223
దలమును=ఆధిక్యమును
మీకు కావలిస్తే నాకుద్యోగమివ్వండి. నేను చాలా బలవంతుడను, ఎనుబోతులతోనూ, ఏనుగులతోనూ, పెద్దపులి, సింహం మొదలైన వానితోనూ పోట్లాడతాను, అంతేకాదు  పెద్ద పెద్ద మల్లురతో కూడా పోట్లాడి మీకు వినోదాన్ని కలిగిస్తాను అంటాడు.
ఇలా చెప్పేసరికి అతనికి విరాటుడు తన వంటశాలలో వంటల వారందరికీ పెద్దగా ఉద్యోగమిస్తాడు.