Unknown
ద్రౌపదీ స్వయంవరం
ఉ.
మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్క యింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నానరనాయకుండు విని యాతతశోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రి పురోహిత విప్రసన్నిధిన్. 22

పాండవులు కుంతీ సహితముగా లక్కయింటిలో అగ్నికి ఆహుతి అయ్యారని బ్రాహ్మణులు చెప్పగా విని ద్రుపదమహారాజు మిక్కిలి దుఃఖాన్ని పొందాడట. అర్జునునకు ద్రౌపది నిచ్చి వివాహం చేద్దామనుకున్నాను, ఇప్పుడెలాగ అని దుఃఖ పరవశుడై ఉన్న ద్రుపదునకు అతని పురోహితుడు నేను నుపశ్రుతిలో(ఓ రకమైన అంజనం లాంటిది) చూచాను, పాండవులు క్షేమంగానే ఉన్నారు. ద్రౌపదికి నీవు స్వయంవరం చాటించు, పాండవులు ఎక్కడవున్నా అప్పటికి తప్పక తిరిగి వస్తారు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పాడు. అలాగే ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని నిర్మింపజేసి దానిని ఛేదించినవానికి ద్రౌపది భార్య కాగలదని స్వయంవరం ప్రకటిస్తాడు. ఈలోగా పాండవులు ఏకచక్రపురాన్నుండి బయలుదేరి ద్రుపదుని పురానికి వస్తుండగా వారికి వ్యాసుల వారి దర్శనం లభిస్తుంది. వారిని చూచిన వ్యాసుడు వారితో ఇలా అన్నాడట.
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35
సీ.
తా నొక్క మునికన్య దనకర్మవశమునఁ బతి బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్యయై ఘోరతప మొనరించిన దానికి శివుఁడు ప్రత్యక్షమయ్యు
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన మని యేనుమాఱు లయ్యబల వేఁడె
న ట్లేని నీకు దేహాంతరంబునఁ బతు లగుదు రేవురు పరమార్థ మనియు
ఆ.
హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల, పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం, వరము సేయుచున్నవాఁడు వాఁడు.36
యుపేతదౌర్భాగ్య =దురదృష్టముతో కూడినది

ఓ మునికన్య తన కర్మవశాన్ని భర్తను బడయలేక పతి కొఱకై శివుని గూర్చి గొప్ప తపస్సు చేస్తుంది. శివుడామెకి ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా పతి దానమిమ్మని 5 సార్లు కోరుతుంది. తరువాతి జన్మలో నీకు 5గురు భర్తలు కలుగుతారని శివుడు అదృశ్యుడౌతాడు. ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టి పెరుగుతోంది. ఆమెకు తండ్రి స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరు ద్రుపదుని పురానికి వెళ్ళండి . మీకు శుభమౌతుంది. అని వ్యాసుడు తన దారిని తాను వెళ్తాడు.
పాండవులు ద్రుపదుని పురానికి వెళ్తూ దారిలో అంగారపర్ణుడనే గంధర్వుని అర్జునుడు ఓడిస్తాడు. ఆ గంధర్వుని నుండి హయములను గ్రహించి అతనికి తన అనలాస్త్రాన్ని ఇస్తాడు అర్జునుడు. ఆ గంధర్వుని అర్జునుడు నీవు మమ్ములను ఏల అదిరి పలికావని అడగ్గా అతడిలా అంటాడు.
ు.
ఇంతులగోష్ఠి నున్నయతఁ డెంతవివేకము గల్గెనేని న
త్యంతమదాభిభూతుఁ డగు ధర్మువు దప్పుఁ బ్రియం బెఱుంగఁ డే
నెంతవివేకి నయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్
వింతయె కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్. 59

ఆడవారిగోష్ఠిలో ఉన్న మగవాడు ఎంత వివేకి యైనా సరే అత్యంత మదాన్ని కలిగినవాడవుతాడు. వాడికిక ఒళ్ళూ పై తెలియదు . ధర్మాన్ని తప్పుతాడు. ప్రియాన్ని తెలుసుకోలేడు. నా పరిస్థితీ అదే , కాముని శక్తి పోగొట్టడం ఎంతవారికీ సాధ్యం కాదు గదా, అంటాడు అంగారపర్ణుడు.