Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-17
ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట
మహాభారతంలోని అనేకానేక ఉపాఖ్యానాల్లో ఇది ఒకటి. ద్రోణుని వ్యక్తిత్వం ఈ కథలో మసకబారింది.
వ.
మఱియు గదా కార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబుల యందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహా ప్రసిద్ధి విని హిరణ్యధన్వుండను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యా గ్రహణార్థి యయి వచ్చిన వాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొనకున్న వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231
ప్రాసాసి=?
తే.
వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి, దానికతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి, నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.
232
క.
ఇటఁ బాండవకౌరవు లొ,క్కొట నందఱు గురుననుజ్ఞ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి, పటుతరజవ సారమేయభటనివహముతోన్. 233

పాండవులు కౌరవులు కలసి భటులతోను, వేటకుక్కలతోను వేటకు బయల్దేరారొకసారి.
వ.
మఱియు నం దొక్క భటునికుక్క తోడుదప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యు సమీపంబున మొఱింగిన నయ్యెలుంగు విని దానిముఖంబునం దేను బాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁడేసిన నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ. 234
ఉ.
తేజిత బాణహస్తు దృఢదీర్ఘమలీమసకృష్ణ దేహుఁ గృ
ష్ణాజిన వస్త్రవిష యా ప్తవిషాదు నిషాదుఁ జూచి యా

రాజకుమారు లందఱుఁ బరస్పర వక్త్రవిలోకన క్రియా

వ్యాజంబునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.
235
వ.
అక్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 236
క.
వినుఁ డే హిరణ్యధన్వుం, డనువనచరనాథుకొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును, ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్.
237
వ.
అనిన విని కురుకుమారు లందఱు మగిడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డొక్కనాఁ డేకాంతంబున నాచార్యున కి ట్లనియె. 238
క.
విలువిద్య నొరులు నీ క, గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలికితిరి నాక కా దీ, త్రిలో కముల కధికుఁ జూచితిమి యొక యెఱుకన్. 239
క.
నా కంటెను మీకంటెను, లోకములో నధికు డతిబలుండు ధనుర్వి

ద్యా కౌశలమున నాతఁడు, మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా. 240
వ.
అనిన ద్రోణుం డదరిపడి వానిం జూతము రమ్మని యర్జునిం దోడ్కొని యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేగిన నెఱింగి వాడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి యేను మీశిష్యుండ మి మ్మారాధించి యివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచి యున్నం జూచి ద్రోణుం డట్లేని మాకు గురుదక్షిణ యిమ్మనిన సంతసిల్లి వాఁ డి ట్లనియె. 241
క.
ఇదె దేహం బిదె యర్థం, బిదె నాపరిజనసమూహ మిన్నిటిలో నె
య్యది మీకిష్టము దానిన, ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘంబనినన్. 242
క.
నెమ్మిని నీదక్షిణహ, స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి మ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన, యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్. 243
తే.
దక్షిణాంగుష్ట మిచ్చిన దానఁ జేసి, బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁడయ్యెఁ, బార్థునకు మనోరుజయు బాసెనంత. 244
దక్షిణాంగుష్టము=కుడి బొటన వ్రేలు
క.
విలువిద్య నొరులు నీక,గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపుసుతునకుఁ బలికిన, పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్. 245
బలరిపుసుతునకున్=అర్జునునకు
మత్తకోకిలము.
భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుం డిలన్. 246
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-16
మత్తకోకిలము.
వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధన మోపఁ డేనియు వీనిమాత్రకు నాలుగేన్
పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచు నుండగాన్. 218

మత్తకోకిలము- నడక ఎంత అందంగా వుంటుందో కదా.

కనీసం పిల్లాడికి పాలనిమిత్తం నాలుగు పాడి పశువులనన్నా ఇయ్యకపోడు గదా అనే ఉద్దేశంతో వెళ్ళాడు పాపం.
వ.
అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన నాతండు దనరాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక యేను రాజును నీవు పేదపాఱుండవు నాకును నీకును ఎక్కడిసఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి నని దన వృత్తాంతం బంతయు జెప్పిన. 219
పాఱుడు=బ్రాహ్మణుడు
క.
విని రోయుతీఁగ గాళ్ళం, బెనఁగె గదా యనుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్
ఘనభుజు నభీష్టపూజా, ధనధాన్యవిధానముల ముదంబునఁ దనిపెన్. 220

వెతుకుతున్నతీగ కాళ్ళకు తగిలింది గదా అనుకుని భీష్ముడు ద్రోణుని అన్నివిధాలా ఆదరించి
చ.
మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు వీరిఁ
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్య లెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలఁడు ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. 222

మనమల కందరికీ విద్య గఱపమని కోరుతూ ద్రోణుడిని ఎటువంటి పొగడ్తతో భీష్ముడు ఆకట్టుకున్నాడో చూడండి. పరశురాముడుకూడా యుద్దంలోనూ నైపుణ్యంలోనూ పరాక్రమం లోనూ నిన్ను పోలడని విన్నాను-అదీ మాట నేర్పంటే.
వ.
అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండు వారలం జేకొని యందఱ కి ట్లనియె. 223
తే.
అస్త్రవిద్యలు గఱచి నాదైన ఇష్ట, మొగిన తీర్పంగ నిందెవ్వఁ డోపు ననినఁ
బాయమొగమిడి కౌరవుల్ పలుకకుండి, రేనుదీర్చెద ననిపూనె నింద్రసుతుఁడు. 224

గురువును ఆకట్టుకోవటం అంటే అదీ. ఆవిద్య అర్జునిడికి మాత్రమే తెలుసు. అందుచేత వెంటనే ఆమాటన్నాడు.
వ.
ఇట్లు తనయిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానా దేశంబులం గలరాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోఁ గలసి కఱచుచుండిరి(మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె) అంత. 225
కర్ణుడు కూడా నానాదేశ రాజులతో పాటుగా ద్రోణుని దగ్గర విద్య నేర్చుకున్నాడా అనే సందేహం కలుగుతున్నది నాకు.
క.
నరుఁ డస్త్రవిద్యా, పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ, బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. 226
వ.
అయ్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీకటి నాతం డేయనేర కుండ వలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడువం బెట్టకుమీ యనిపంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయు చున్న నొక్కనాఁటిరాత్రి యందు. 227

చీకటిలో అన్నం తినటం అలవాటయితే ధనుర్విద్యను కూడా చీకటిలో అదేవిధంగా నేర్చుకోవచ్చన్నమాట.
ఉ.
వాసవనందనుండు గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బోవుడు భోజన క్రి యా
భ్యాసవశంబునం గుడిచి పన్నుఁగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.228
పటుమారుతాహతిన్= మిక్కిలి గాలి దెబ్బచేత
క.
పాయక చీఁకటియందును, నేయం దా నభ్యసించె నిట్టియెడం గౌం
తేయు ధనుర్జ్యాధ్వని విని, ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్.228

శిష్యుల విద్యాపరిశ్రమ చూస్తే ఏ గురువుకైనా ముచ్చట వేస్తుంది కదా.
సీ.
ఆతనియస్త్రవిద్యాభియోగమునకుఁ బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
యన్న ధనుర్ధరు లన్యులు నీకంటె నధికులు గా కుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా నని పల్కి ద్వంద్వసంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథమహీవాజివారణములపై నుండి దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ
తే.
బహువిధవ్యూహభేదనోపాయములను, సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటిభార్గవుఁడు వింట, నిట్టిఁడే యని పొగడంగ నెల్ల జనులు.229
అభియోగమునకున్=పూనికకు

అలా విలువిద్యలో అర్జునుని అందరికంటె ప్రవీణు డయ్యేలా విద్య గఱపాడు ద్రోణుఁడు.