Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-3
వ.
కర్ణుండును జనుల నందఱ నదల్చి చొత్తెంచి రంగమధ్యంబున నిలిచి కలయం జూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి జలధరధ్వాన గంభీరరవంబున నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32
జలధరధ్వాన=ఉఱుము వంటి శబ్దము గల
క.
నీవ కడు నేర్పుకాఁడవు, గా వలవదు వీనిఁ గొన్ని గఱచితి మేమున్
నీవిద్య లెల్లఁ జూపుదు, మే వీరులుసూచి మేలుమే లని పొగడన్. 33
క.
అనిన నినతనయుపలుకులు, జనులకు విస్మయము సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును మఱి దుర్యో, ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్క్షణమాత్రన్. 34
వ.
అంత ద్రోణు చేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జును చూపినయస్త్రవిద్యావిశేషంబు లెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకునుహితంబుసేసి నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యం బుపయోగింపు మనిన నట్ల సేయుదునని కర్ణుం డొడంబడి యిమ్మూఁగిన రాజలోకంబును నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయవలయుననిన ధార్తరాష్ట్ర మధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డిట్లనియె. 35
క.
పిలువంగఁబడక సభలకు, బలిమిం జని పలుకుపాపభాగుల లోకం
బులకుఁ జన వేఁడి పలికెదు, పలువ యెఱుంగవు పరాత్మ పరిణామంబుల్. 36
పలువ=దుర్జనుఁడా!
పర ఆత్మ పరిణామంబుల్=ఇతరుల, తన-కొలదులు
క.
అనిన విని పార్థునకు ని, ట్లనియె నినాత్మజుఁడు దుర్బలాయాసక్షే
పనిబంధనమ్ములు వలుకక, ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడఁగుము నాతోన్. 37
క.
ఈరంగభూమి యస్త్రవి, శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు, వీరికిఁ గా దనువిచార విషయము గలదే. 38
విషయము=తావు
వ.
అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన. 39