Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-12
వ.
ఆ బ్రాహ్మణునికి గుంతి యిట్లనియె నయ్యా దీనికి సంతాపింప వలవ దీయాపద దలుగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడు కొక్కరుండ వాఁడును గడుబాలుండు బలిగొనిపోవ నర్హుండు గాఁడు నా కేవురు గొడుకులు గలరు వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొనిపోయెడు ననిన దాని విన నోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యిట్లనియె. 272
మధ్యాక్కర.
అతిధియై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు
హితముగా రక్కసువాతఁ ద్రోవ నెట్లొడంబడుదు
మతి నవమానింపఁగా దనిన విప్రుమరణంబు దలఁచు
టతిపాతకము పాతకములలో బ్రహ్మహత్యయుఁ బెద్ద. 273

మీరు మాకు అతిథులు. అలా అతిథులై వచ్చినవారిని నా కొరకై రక్కసుబారికి అప్పగించటానికి నేనెలా ఒప్పుకుంటాను. పాపాలన్నిటిలోకి విప్రుమరణము, అందులోనూ బ్రహ్మణ హత్య మరీ మరీ పాపము . అని అంటూ మనం మొదట్లో అనుకున్న విషయాన్ని చెపుతాడు.
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274
వ.
మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యొరులచేతం జేయబడుటం జేసి నాకుం బాతకంబు లేదు దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడనోప ననినఁ గుంతి యిట్లనియె. 275
క.
ఏనును దీనిన తలంచి మ,హీనుత విప్రవధ యెద సహింపక మఱి నా
సూను సమర్పించితి మ, త్సూను వధింపంగ రక్కసునకు వశంబే. 276
క.
ఖలు నసుర నోర్వనోపెడు, బలయుతుఁగా నెఱిఁగి కొడుకుఁ బంచితిఁ గా కి
మ్ముల శతపుత్త్రులు గల ధ,న్యుల కైన ననిష్టుఁ డగుతనూజుఁడు గలఁడే. 277
వ.
ఈతని చేతన తొల్లియుఁ బెక్కెండ్రసురలు నిహతు లయిరి వీఁడు మహా బలవంతుండు మంత్రసిద్ధుండని భీముం బిలిచి యీబ్రాహ్మణునాపదం దలిగి నాకు మనఃప్రియంబు సేయు మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంపం బూనె.
తరువాతది బకాసురవధ కథ.
ఆది పర్వము షష్టాశ్వాసము సమాప్తము.