Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-1
కుమారాస్త్ర విద్యాసందర్శన కథాప్రారంభము
క.
ఘోరాస్త్రశస్త్రవిద్యల, నారూఢములందు నిపుణు లైరి కుమారుల్
మీరలు వీరలవిద్యా, పారముసను టెఱుఁగ వలయు భవదీయసభన్.3

కుమారులందఱూ అస్త్రశస్త్రనిద్యలలో ఆరితేరారు. మీరో సభచేసి వీరి విద్యాపారాన్నిచూడాల్సింది అని ద్రోణుఁడు ధృతరాష్ట్రునితో అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుని ఆనతి మేరకు విడురుడు రమ్యమైన సభను అన్నివిధాలా అలంకరించి ఏర్పాటు చేయగా ఓ రోజు గాంధారీ సహితముగా ధృతరాష్ట్రుడా సభకు బంధుజనంతో సహా వచ్చి ఆసీనుడయ్యాడు.
తే.
సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క, నెతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్త్రి, కెలన నుండె నున్మీలితనలిననేత్ర. 6

కుంతీదేవి కూడా సుతుల ధనుర్విద్యాప్రదర్శనము చూచు వేడ్కతో గాంధారి ప్రక్కన కూర్చుని ఉన్నది.
ద్రోణాచార్యులవారు అశ్వత్థామతో సహా రంగమధ్యమున ప్రవేశించాడు.
శా.
ద్రోణాచార్యుపిఱుంద నొప్పి కృతహస్తుల్ బద్దగోధాంగుళి
త్రాణుల్ మార్గణపూర్ణతూణులు మహాధన్వుల్ కుమారుల్ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగాన్. 10
బద్దగోధాంగుళిత్రాణుల్=కట్టుకొనబడిన ఉడుముతోలు చేతి కవచములు గలవారు.
ధర్మరాజుమొదలుగా గల కుమారులందరు వారివారి వయస్సుల ప్రకారము బారులు తీరి ద్రోణుని ప్రక్కన వచ్చి వరుసగా నిలబడ్డారు.
గురువుగారి అనుమతి ప్రకారం అందరూ తమ తమ విద్యలను వరుసగా ప్రదర్శించసాగారు.

భీమ దుర్యోధనులు తమగదాకౌశలంబు చూపుట
మ.
అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్ర భై
రవహుంకారరవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లఁ బాం
డవ కౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థ మై భావిపాం
డవ కౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాకృతిన్. 14
వియత్ ఆగారం=ఆకాశ గృహము
అకాండప్రోత్థ మై=కారణము లేక కలిగిన దై
వారి గదాయుద్ధం అతిభయంకరమై భావి భారత కౌరవ రణానికి సూచనగా అనిపించినదట.
క.
ఆరాజసుతులవిద్యా, పారగపటుచేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి, ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచు నుండెన్.15
పరువడిన్=క్రమముగా
వ.
అంత భీమదుర్యోధనులగదాకౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామం బంచి వారి నిద్దఱ వారించి వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి నా ప్రియశిశ్యుం డయిన యర్జునుధనుఃకౌశలంబుఁ జూడుం డనిన నయ్యాచార్యువచనానంతరంబున. 16