Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-18
ద్రోణుఁ డస్త్రనిద్యం దనశిష్యులఁ బరీక్షించుట.
వ.
అక్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు గృత్రిమం బయిన భాసం బనుపక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి దాని నందఱకుం జూపి మీమీ ధనువుల బాణంబులు సంధించి నా పంచినయప్పుడ యప్పక్షితలఁ దెగ నేయుం డే నొకళ్ళొకళ్ళన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీవృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనా నంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె. 248
తే.
వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము, దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ
యనిన నిమ్ముగఁ జూచితిననిన వెండి, యునుగురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి. 249
క.
జననుత యామ్రానిని న,న్నును మఱి నీ భ్రాతృవరులనుం జూచితె నీ
వనవుడుఁ జూచితి నన్నిటి, ననఘా వృక్షమున నున్న యవ్విహగముతోన్. 250
వ.
అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీ దృష్టి చెదరె నీవు దీని నేయ నోపవు పాయు మని యవ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేననకులసహదేవులను నానాదేశాగతు లయిన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందరనందనుం బిలిచి వారి నడిగినయట్ల యడిగిన నర్జునుం డి ట్లనియె. 251
క.
పక్షిశిరంబు దిరంబుగ, నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ,క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్. 252
వ.
ఇట్లశ్రమంబునఁ గృత్రిమపక్షితలఁ దెగ నేసినయర్జునునచలితదృష్టికి లక్ష్యవేదిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె నంత. 254
లక్ష్యవేదిత్వంబునకు=గుఱినిగొట్టుటకును
క.
మానుగ రాజకుమారుల, తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థమరిగి యందు మ,హానియమస్థుఁ డయి నీళు లాడుచు నున్నన్. 255
క.
వెఱచఱవ నీరిలో నొ, క్కెఱగా నొకమొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు, చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్. 256
వెఱచఱవన్=భయపడఁగా
ఒక్కెఱగాన్=ఉగ్రముగా
చిఱుదొడ=పిక్క
క.
దాని విడిపింపఁ ద్రోణుఁడు, దా నపుడు సమర్థుఁ డయ్యుఁ దడయక పనిచెన్
దీని విడిపింపుఁ డని నృప,సూనుల శరసజ్యచాపశోభితకరులన్. 257
శరసజ్యచాపశోభితకరులన్=బాణముల నెక్కుపెట్టిన విండ్లచేఁ బ్రకాశించు చేతులు గలవారిని
శా.
దానిన్ నేరక యందఱున్ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానం గానిశరీరముం గలమహోగ్రగ్రాహమున్ గోత్ర భి
త్సూనుం డేనుశరంబులన్ విపులతేజుం డేసి శక్తిన్ మహా
సేనప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగాన్. 258
గోత్ర భిత్సూనుండు =అర్జునుఁడు
మహాసేనప్రఖ్యుఁడు=కుమారస్వామి వలెఁ బ్రసిద్ధుఁడు
వ.
అమ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్న దేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి ద్రోణుం డర్జును ధనుఃకౌశలంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగు నని తనమనంబున సంతోషించి వానికి ననేకదివ్యబాణంబు లిచ్చె నని యర్జును కొండిక నాఁటి పరాక్రమగుణ సంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పెనని. 259
ఆది పర్వము పంచమాశ్వాసము సంపూర్ణం.