Unknown
అశ్వమేధ పర్వము-ప్రథమాశ్వాసము-1
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకు మనస్తాపోపశమంబు చేయుట.
సీ.
శారీరమును మానసంబును నా రెండు తెఱఁగు లై వ్యాధి వర్తించు నందు
విను వాతమునుఁ బిత్తమును శ్లేష్మమును సమత్వంబుఁ బొందినయప్డు స్వస్థుఁడగున
రుం డవి మూఁడు నొక్కండయి వికృతి నొందిన శరీరవ్యాధి యనఁగఁ బరఁగు
సత్వరజస్తమస్సమత సుస్థ్సితి విషమత మనోవ్యాధి యీద్వితయమునకు
ఆ.
నొంటి దోఁచు టెపుడు నొదవ దన్యోన్యసం, జనకజన్యభావ తనుతఁ జేసి
వికృతికాల మొకట నొకటి తోఁచునది వా, తాదులందు గుణములందు నధిప.113

శారీరకము, మానసికము అని వ్యాధులు రెండు విధములు. వాత, పిత్త, శ్లేష్మాలు
సమత్వం పొందితే మనిషి ఆరోగ్యంగా వుంటాడు. ఆ మూటిలో ఏ ఒక్కటి వికృతి పొందినా
మనిషి శారీరక రోగాన్ని పొందుతాడు. మనిషిలోని సత్త్వ, రజ, తమో గుణముల సమత్వం
మానసిక సుస్థ్సితి, వానిలో ఏ ఒక్కటి విషమత చెందినా కలిగేది మనోవ్యాధి.
యీ రెంటిలో ఒక్కటే తోచటం ఎపుడూ జరగదు.ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి
వుంటాయి.వాతాదులలోన, గుణములలోన వికృతికాలములో ఒకటి ఒకటి కనిపిస్తాయి.

కృష్ణుఁడు ధర్మరాజుతో అప్పుడు జరిగిన యుద్ధము మిథ్యాయుద్ధమని, సత్యయుద్ధం అంటే ఏమిటో చెపుతానని ఇలా అంటాడు.
ఉ.
అమ్మెయి బంధుమిత్రులసహాయతకల్మి ప్రయోజనంబు లే
దమ్మహనీయయుద్ధమున కాత్మయ తోడు మనంబు శత్రుఁ డీ
వెమ్మెయి నైన శాంతి ఘటియింపుము లోపగఁ దీర్పు మందు శాం
తమ్మ చుమీ మనోవిజయితన్ వెలుఁగొందుము శాంతబుద్ధివై.118

ఆ యుద్ధంలో బంధుమిత్రుల సహాయసంపద ఉండదు. ఆగొప్ప యుద్ధానికి ఆత్మయే తోడు. మనస్సే శత్రుడు. నీవేవిధంగా నైనా శాంతిని పొందు.లోననున్న పగను మాన్చుము. శాంతమే మనోవిజయమును కూరుస్తుంది.శాంతబుద్ధివై వెలుగొందు.
తే.
అంతరం బగునిక్కయ్య మధిప గెలువ, కిట్ల యేగతిఁ బోయెదో యెఱుఁగ దీని
నీవ కనుఁగొని సద్బుద్ధినిశ్చయప్ర,వీణుడవు కమ్ము మాటలు వేయు నేల.

అంతరంగంలో జరిగే ఈ యుద్ధం గెలవకుండా ఇటుల యేగతి పొందుతావో ఎఱుగను. దీనిని నీవే కనుక్కో. సద్బుద్ధి నిశ్చయప్రవీణుడవు కమ్ము. ఇంక మాటలు వేయయినా ఏమి ప్రయోజనము?
వ.
అని చెప్పి కౌంతేయాగ్రజునితోఁ గృష్ణుండు వెండియు నిట్లను. రెండక్షరంబులు మృత్యువు, మూఁడక్షరంబులు బ్రహ్మంబవి యెయ్యవి యంటేని వినుము మమ యనునవియును నమమ యనునవియును నై యుండు భూతంబులచేతం గానంబడక యా బ్రహ్మమృత్యువులు పోరుచుండు.120
క.
వెలిపగఱ గెలుపు గెలుపే, యలఘుమతిన్ గెలువవలయు నభ్యంతరశ
త్రులఁ దద్విజయము మోక్షము, నలవఱుపం జాలు నొంట నమ్మేలగునే.124

బయటి శత్రుల గెలుపు గెలుపు కాదు అంతశ్శత్రులను గెలవటం ద్వారానే మోక్షము కలుగుతుంది.
క.
విను మంతశ్శత్రులలో, ఘనుఁ డగుఁ గాముఁడు నిరస్తకామం బగువ
ర్తనము విశద మద్యయనయ,జనదానంబులును గామసహితములు కదా.125

విను. అంతశ్శత్రులలో కాముడు ఘనమైనవాఁడు. నిరస్తకామమగు వర్తనము విశదము.అధ్యయనము, యజనము, దానములు కూడా కామసహితములే కదా.
క.
విను పెక్కు లేల కోరిక, మనమునఁ జొరనీక యున్న మడియుం గాముం
డనవధ్య యశ్వమేధం, బొనరింపుము కోరకుండు మొక్కటియు మదిన్.133

కోరికను మనస్సులో చొరనీక పోతే కామం చస్తుంది. ఏ కోరికా మనస్సులో వుంచుకోకుండా కామ్యరహితంగా అశ్వమేధ యాగం చెయ్యి.అని చెప్తాడు ధర్మరాజుతో కృష్ణుడు.
Unknown
అనుశాసనిక పర్వము-ప్రథమాశ్వాసము-1
ధర్మరాజు భీష్మపితామహుడు వివరంగా చెప్పిన వివిధ ధర్మంబులు వినిన తరువాత భీష్మునితో నిట్లనియె.
సీ.
అనఘ నాదగు చిత్తమునకు శమంబు కావించుట కై నీవు వివిధవిశద
భంగులఁ బరమకృపానిరతుండ వై సకలధర్మోపదేశములుఁ జేసి
తిమ్మెయిఁ జెప్పఁగానించుకయేనియు శమము లేకున్నది చలముకొని య
నేకబంధుల వధియించితి నది యొక్క తలయు నీకలిగిన దారుణత్వ
ఆ.
మొక్కతలయు నైన యుగ్రకర్మంబులు, చిత్తవృత్తిఁ దగిలి యుత్తలంబుఁ
జేయ శాంతి యెట్లు సిద్ధించు మునిమాన,నీయ యింక నేమి చేయువాఁడ.3

పుణ్యాత్ముడా! నా మనసుకు శాంతి చేకూర్చుటకై నీవు వివిధ ధర్మోపదేశములు కడుంగడు విశదమగునట్లుగా పరమకృపారతుడవై తెలియ చెప్పావు. కాని దానిమూలంగా కొంచెం కూడా నాకు శమము లేకుండా వున్నది. మాత్సర్యాన్ని పూని అనేకమంది బంధువులను చంపాను. అది అంతా ఒకవైపు, ఇంకో వైపు నీకు చేసిన దారుణమైన ఉగ్రకర్మలు నా మనసును పిండివేస్తుండగా నాకు శాంతి యెలా కలుగుతుంది. ఈ పరిస్థితిలో నేను ఇప్పుడు ఏం చేయాలి ?
ఇలా పలికిన ధర్మరాజుతో భీష్ముడు 'వధించటానికి మనుజుడు కర్త' గాదని దానికుదాహరణంగా గౌతమీలుబ్ధకసర్పమృత్యుకాలసంవాదాన్ని అతనికి వివరిస్తాడు.
గౌతమి అనే బ్రహ్మణ స్త్రీ కొడుకు పాము కరచి చనిపోతే ఆవిడ దుఃఖిస్తుండగా చూచి ఓ కిరాతుడు ఆ పాముని తాడుతో కట్టి తెచ్చి ఆమెకు చూపించి ఆ పామును చంపబోతాడు. అప్పుడామె అతనిని వారిస్తూ ఇలా అంటుంది.
క.
విధివశమున వచ్చినకీ,డధములు కొనియాడి వెడఁగులై విపులభవాం
బుధి మునుగుదురు మునుంగరు, సధర్ములగు నుత్తములు ప్ర శాంతిం జులకన్.9

విధివశాన్ని వచ్చిన కీడును అధములైనవారు పెద్దగా జేసి వెడగులై విపులభవాంబుధిలో మునుగుతారు. కాని సధర్ములైన ఉత్తములు ప్రశాంతి నొందినవారై అలా మునగరు.
అదీకాక ఈ పాముని చంపినా నాకొడుకు తిరిగిబ్రతకడు గదా.అని నచ్చచెప్పినా వివశుడైన కిరాతుడు వినక ఇంకా పామును విడవనని అంటాడు.అప్పుడామె నీ అర్జునక నామము నీకున్న స్వచ్ఛమగు విధమునకు తగివుండాలి, బ్రహ్మణ స్త్రీనైన నేను వద్దని చెప్తున్నపుడు బ్రాహ్మణ సహాయుడవైన నీవు దానికి వ్యతిరిక్తంగా నడవకూడదు కదా. నా సన్నిధిలో నీకీ క్రూరత వలదు.అంటే జనబాధకములైన జంతువులను చంపొచ్చు పాపం రాదు అంటాడు. అయినా ఆమె ఒప్పుకోదు.అప్పుడు పాము నాతప్పేమీలేదు, నీవు ధర్మాన్ని తెలియవు, మృత్యుపరాధీనతను బాలుడిని కాటు వేసాను కాని నాకు మనసులో రోషకామాలు లేవు అంటుంది. నీవు మృత్యువునకు సాధనమవు కాన నిన్ను చంపవచ్చుఅనగా మృత్యువు కూడా అక్కడికి వచ్చి పాముతో-- నేను నిన్ను పంపిన విధంగా యమధర్మరాజు నన్ను పంపాడు అండుచేత నా తప్పూ నీ తప్పూ కూడా లేదంటుంది.అప్పుడక్కడికి కాలుడు వచ్చి నేను,మృత్యువు,పాము కూడా కారణం కాము. ఈతడు చేసిన కర్మఫలమే దీనికి కారణం అంటాడు.
క.
విను కర్మం బొనరించును, జననము మరణంబు నదియ సౌఖ్యము దుఃఖం
బును గావించుం దనచే,సినదానింబడక పోవ శివునకు వశమే.34
కర్మ వలసనే చావు పుట్టుకలు, సుఖదుఃఖాలు అన్నీ కలుగుతాయి. దానిని దాటటం శివునికి కూడా వశము కాదు.
అందుచేత ఈ జరిగిన యుద్ధానికీ, చావులకు నీవు గాని దుర్యోధనుడు గాని కారణం కారు . దీనికి విచారించాల్సిన పని లేదు.అంటాడు ధర్మరాజుతో భీష్ముడు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్సాసము-1
మంగళ శ్లోకము
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీ కన్ధరా శ్శ్రేయసే. 1

లక్ష్మీ సరస్వతీ పార్వతులను హృదయ ముఖ శరీరములందు స్థిరముగ ధరించి, స్త్రీ పురుష యోగమున జనించిన లోకముల నిల్పుచు, వేదత్రయాత్మకులు త్రిమూర్తులును, దేవతలచేఁ బూజింపబడు విష్ణుబ్రహ్మేశానులు శ్శేయస్సు కొఱ కగుదురు గాక.
ఉ.
రాజకులైక భూషణుఁణు రాజమనోహరుఁ డన్యరాజ తే
జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రి కా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమపేంద్రుఁ డున్నతిన్,3

రాజకులమునకు అలంకారమైనవాఁడు, రాజులలో మనోహరమైనవాఁడు, ఇతర రాజుల తేజస్సనేకాంతిని జయించిన వీరుడు, విశుద్ధమైన శరత్కాల చంద్రుని వెన్నెలవలె ప్రకాశించు సర్వలోకుడైనవాడు, గెలువఁబడనిగొప్ప భుజమందలి ఖడ్గధారయనెడి జలములచే శాంతమైన శత్రువు లనెడి దుమ్ముగలవాఁడు, అయిన రాజమహేంద్రపు రాజు ఉన్నతితో,
క.
విమలాదిత్యతనూజుఁడు, విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు
త్తమచాళుక్యుఁడు వివిధా, గమవిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.4

విమలాదిత్యుని కుమారుడు, శుభ్రమైన ఆలోచన కలవాడు, కుమారుఁడైన విద్యాధరుఁడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధములైన ఆగమశాస్త్రములలో బాగుగా పరిశ్రమ చేసినవాఁడు, కాంతిలో చంద్రుని వంటివాఁడు రాజరాజ నరేంద్రుడు.

సీ.
తనకులబ్రాహ్మణు ననురక్తు నవిరళజపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాదినానాపురాణవిజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్రజాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు
ఆ.
నిత్యసత్యవ చను మత్యమరాధిపా, చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మ విదుఁడు వరచాళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.9

తన పురోహితుడు, ఇష్టుడు, జపహోమముల యందధికమైన తత్పరత గలవాఁడు, విపులమైన శబ్దములను శాసించగలవాఁడు, శాస్త్రములఁ జదివిన వాడు, బ్రహ్మాండాది నానా పురాణవిజ్ఞానములో ప్రసిద్ధుడైనవాఁడు, పాత్రుడు, ఆపస్తంబసూత్రుడు, ముద్గలగోత్రములో పుట్టినవాఁడు, మంచి ప్రసిద్ధిచెందిన తెల్లని చరితముకలవాఁడు, లోకజ్ఞుడు, ఉభయభాషాకావ్యముల రచనలలో శోభిల్లువాఁడు, మంచి ప్రతిభతో మిక్కిలి వెలయువాఁడు,

నిత్యము సత్యవచనమునే పలుకువాఁడు, బుద్ధియందు బృహస్పతిని బోలువాఁడు, సుజనుడు ఐన నన్నపార్యుని చూచి పరమ ధర్మ విదుఁడు, ప్రసిద్ధినొందిన చాళుక్యవంశమునకు ఆభరణమువంటివాడైన రాజరాజనరేంద్రుడు ఈవిధంగా అన్నాడు.
మ.
ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లైయుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ .12

ఈ ఐదు నాకు చాలా ఇష్టమైనవి. బ్రహ్మణుల సేవ, భారతమును వినుటయందాసక్తి, శంకరుని ధ్యానముసేయుట, సంతతము దానములు చేయుట, సాధుజనులతో సాంగత్యము-అనేవి. ఇవి నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉంటాయి.
గరికిపాటి నరసింహారావు గారు వారి శ్రీమదాంధ్రమహాభారత సామాజిక వ్యాఖ్యలో ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ
ఇక్కడ చెప్పిన ఐదు గుణాలు ఐదుగురు పాండవులను సూచిస్తున్నాయంటున్నారు. నిజమే ననిపిస్తుంది.
భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్=ధర్మరాజు
భారతశ్రవణాసక్తియుఁ=నకులుడు
సంతతదానశీలత=భీముడు
బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహోత్సవమున్=అర్జునుడు
శశ్వత్సాధుసాంగత్యమున్=సహదేవుడు