Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౦
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ
డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨

శంతన మహారాజు యోజనగంధి యైన సత్యవతిని చూచిన ఘట్టంలోని పద్యం. ఎంత మనోహరంగానూ సుందరం గానూ ఉందో చూడండి.

గంగా శంతనుల సమయము
ప్రతీపుడామెను నీవు నా కుఱువెందు కెక్కావు అని అడగ్గా నేను నీ సద్గుణాలకు మెచ్చి నీకు భార్య కావాలని వచ్చాను.
నన్ను పెళ్ళి చేసుకో అంటుంది.
చ.
అనినఁ బ్రతీపుఁ డి ట్లనియె నంబురుహానన యాగ్ని సాక్షికం
బునఁ బరిణీత యైనసతిఁ బొల్పుగ నొక్కతఁ గాని యన్యలన్

మనముననేనియుం దలఁప మానిని యిట్టిజితాత్ము నన్ను
ని
ట్లని పలుకంగ నీ కగునె యన్యులఁ బల్కినయట్ల బేల వై. ౧౩౮

నేను ఏకపత్నీవ్రతుడిని. నాతో ఇతరులతో పలికినట్లుగా ఇలా మట్లాడటం తగునా అంటాడామెతో ప్రతీపుడు.
వ.
మఱి యదియునుం గాక స్త్రీభాగం బయిన డాపలికుఱు వెక్కక పురుషభాగం బై పుత్త్రారోహణయోగ్యం బైన నా వలపలికుఱు వెక్కితి గావున నాపుత్త్రునకు భార్యవగు మనిన నదియు నట్ల చేయుదు నని యదృశ్య యయ్యె నంతం బ్రతీపుండును బుత్త్రార్థి యై సకలతీర్థంబులయందు సునందా దేవియుం దానును వేదవిహిత వ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు తపంబు సేసిన. ౧౩౯

స్త్రీ భాగమైన ఎడమ తొడ మీద గాకుండా పురుషభాగమైన కుడి తొడమీద ఎక్కావు కావున నా కొడుకుకు భార్యవు కమ్మని చెప్పగా అలానే అంగీకరించి అదృశ్యమైంది గంగాదేవి. తరువాత ప్రతీపుడు భార్యతో కలసి సంతానం కోరి వ్రతాలూ పూజలూ చేయగా వారికి శంతనుడు పుడతాడు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాక అతనిని రాజ్యాభిషిక్తుని చేసి యిలా అంటాడు.
మధ్యాక్కర.
తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున
నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టికమనీయరూప
వొనర నాసుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య

కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.
౧౪౨

తానిచ్చిన మాటప్రకారం గంగను వివాహమాడమని కొడుకుకు చెప్తాడు ప్రతీపుడు.
వ.
మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని చెప్పి తపస్సు చేసుకోడానికి వెళ్తాడు.
ఒకరోజు శంతనుడు వనములో విహరిస్తుండగా ఒక అందమైన కన్యక అతనికి దృగ్గోచరమౌతుంది. ఆమెను చూచి.
చ.
కని మునికన్యయో దనుజకన్యకయో భుజగేంద్ర కన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ

వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య.యంచు న

య్యనఘుఁడు దాని జిత్తమున నాదటవోవక చూచెఁ బ్రీతితోన్
. ౧౪౫

ఆమెనాతడు తనివితీరా చూస్తుండి పోయాడట. అప్పుడామె అతనితో
క.
భూనాధ నీకు భార్యం, గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము, మానుగ నా కిష్ట మయినమార్గముఁ బ్రీతిన్
. ౧౪౯
సమయంబు =సంకేతము
గంగా శంతనుల సమయము
వ.
అది యె ట్లంటేని యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను నప్రియంబులు వలుకక యుండను వలయు నట్లైన నీకు భార్య నై యభిమత సుఖంబు లొనరింతు నటు గాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె గంగయు మనుష్యస్త్రీరూపధారిణి యై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె నంత. ౧౫౦

నోరుమూసుకుని తాను చెప్పినట్లే వినాలని ముందే ఒప్పందం ఖరారు చేసుకుందావిడ.

అలా నియమించుకున్న తరువాత తనకు పుట్టిన పిల్లల్ని వరుసగా ౭ గురి వరకూ పుట్టీపుట్టగానే గంగానదిలో పడవేస్తుండే దావిడ. అదంతా సహించిన శంతనుడు 8వ సారి మాత్రం ఆమెకు అడ్డు చెప్తాడు.
క.
పడయంగ రానికొడుకులఁ, గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతిని వై తీ
కొడుకు నుదయార్క తేజుని, విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్.
౧౫౩
వ.
దాని నప్రియంబులు వలికి వారించిన నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచి నీతోడిసంగతి నాకు నింతియ యేను బుణ్యజలప్రవాహ పవిత్రతం ద్రిభువన పావని యనం బరఁగిన గంగఁ జు మ్మీవసువులు వసిష్టు శాపంబున వసుమతిం బుట్ట వచ్చుచుండి యే మొండు చోట జన్మింపనోపము నీ యంద పుట్టెదము మర్త్యంబునం బెద్దకాలంబుండ కుండ మమ్ము ముక్తులం జేయుమని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి దీన నీకుం బుణ్యలోకంబు లక్షయ్యంబులగు మఱియు నియ్యష్టమ పుత్త్రండు వసువులయం దొక్కొక్కళ్ల చతుర్థార్ధంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు లోక హితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలంబుండు ననిన గంగకు శంతనుం డి ట్లనియె. ౧౫౪

వసువులనేవారు దేవతలు వారికి వసిష్టముని శాపమెందు కిచ్చాడు, అష్టమ వసువు అందరికంటె వేరుగా ఎక్కువకాలం భూమి మీద జీవించటానికి కారణమేమిటని శంతనుడామెను అడిగాడు. అప్పుడామె ౮ గురు వసువులు వసిష్టుని ఆశ్రమానికి భార్యలతో సహితంగా క్రీడార్ధం వచ్చారు. వారిలో అష్టమ వసువైన ప్రభాసుని భార్య ఆశ్రమంలోని నందిని అనే ధేనువును చూచి ముచ్చటపడి దానిని తన చెలియలి నుశీనరనరపతి కూతురు జితవతికి బహుమానంగా ఇద్దామని అంటే వసువులందరూ కలసి ఆ హోమధేనువుని అపహరిస్తారు. ఆ విషయం దివ్యదృష్టితో గ్రహించిన వసిష్టమహర్షి వారిని మనుష్యయోని పుట్టాల్సిందని శాపమిస్తాడు. అప్పుడు వారంతా మునికాళ్లమీదపడి ప్రార్ధించగా ఎక్కువకాలం మనుష్యులుగా వారందరూ ఉండక్కరలేదని అనుగ్రహిస్తూ అష్టమ వసువు అయిన ప్రభాసుడు నేరం ఎక్కువగా చేసాడు కాబట్టి అతను దీర్ఘకాలం మనుష్యలోకంలో ఉంటాడనిన్నీ మరియు అనపత్యుడుగా కూడా వుంటాడని అనుగ్రహిస్తాడు వసిష్టమహాముని.

ఈ కథ అంతా చెప్పి గంగాదేవి కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ తనతోనే ఉంటాడని తీసుకుని వెళుతుంది.
కొంతకాలం జరిగాక శంతనుడు గంగానది చెంతకు వాహ్యాళికి వెళ్ళగా అక్కడ
తరలము.
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్ ధను వభ్యసించుచు బాణసంహతి సేతుగా

ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న

త్యనఘు నాత్మ సమాను నాత్మజు నాపగేయు మహాయశున్.
౧౬౫

బాణాలతో గంగాప్రవాహానికి సేతువును నిర్మస్తున్న తన పోలికలతో ఉన్న గాంగేయుని శంతనుడక్కడ చూస్తాడు.కాని చిన్నతనంలో చూచి ఉండటం చేత గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడు గంగాదేని అక్కడికి వచ్చి కొడుకును శంతనునకు చూపి ఇలా అంటుంది.
సీ.
సాంగంబు లగుచుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధ
శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నేర్చినయట్ల నేర్చె

బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత దక్షుఁ డంతియ కడుదక్షుఁడయ్యె

నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల యట్టిఁడ యనఘమూర్తి


ఆ.

నొప్పుకొనుము వీని నుర్వీశ యని సుతు, నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు

నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్న పేదయ, పోలె సంతసిల్లి భూవిభుండు.
169

ఇక్కడ గాంగేయుని సామర్ధ్యం వర్ణించబడింది.
వ.
తన పురంబునకు వచ్చి సకల రాజన్యప్రధానసమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యపట్టాభిషేకంబు సేసి కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగు వత్సరంబు లనన్యవ్యాపారుం డై యుండి యొక్కనాఁడు యమునాతీరంబున వేఁట లాడుచుఁ గ్రుమ్మరువాఁడపూర్వసురభి గంధం బాఘ్రాణించి దానివచ్చినవలనారయుచు నరిగి యమునాతీరంబున. ౧౭౦
క.
కనకావదాతకోమల, తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాధుఁడు, గనియెను సురకన్యవోనికన్నియ నంతన్
. ౧౭౧
కనకావదాత=బంగరువలె పచ్చనై
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్

దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం

తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨