Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభాపర్వము-ప్రధమాశ్వాసము-2
భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు కలిగించుట
క.
ఆరంభరహితుఁ బొందునె, యారయసంపదలు హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ, తారంభులనోర్చు నెంతయధికుల నయినన్. 123

ఏ పనినీ ప్రారంభించని వాడిని సంపదలు చేరవు. హీనుడైనా సరే కృతప్రయత్నుడైన వాడు ప్రయత్నించని వారిని వారెంత అధికులయినా సరే ఓడించగలుగుతాడు.
క.
కడు నధికునితోడఁ దొడరినఁ, బొడిచిన నొడిచినను బురుషుపురుషగుణం బే
ర్పడుఁగాక హీను నొడుచుట, కడిఁదియె పౌరుషము దానఁగలుగునె చెపుమా. 124

తనకంటె అధికుడైన వానితో కలబడితే పురుషునకు మగతనం కానీ హీనుడిని అణచటం గొప్పా ? దానివల్ల పౌరుషం కలుగుతుందా చెప్పు.
జరాసంధుని మీదకు దండయాత్రకు పోవటానికి ఉద్యమిస్తూ భీముడు ధర్మరాజుతో పై విధంగా అంటాడు.
అప్పుడర్జునుడు--
క.
కులరూపగుణద్రవ్యం,బులు విక్రమవంతునందు భూవిదితము లై
నిలుచు నవిక్రమునకు నవి, గలిగియు లేనిక్రియ నప్రకాశంబు లగున్. 129

కులము, రూపము, గుణము, ద్రవ్యము --ఇవి విక్రమవంతుని యందు ప్రకాశించినట్లుగా అవిక్రమునందు ప్రకాశించవు.