Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
క.
అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్.
౯౨

యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశకరుడవుతాడనీ నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.
క.
భూరిగుణు నిట్టికుల వి, స్తారకు దారకు నుదార ధర్మప్రియు ని
ష్కారణమ తప్పఁ జూడఁగ, సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్. ౯౩

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?
చ.
ుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
౯౫

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే.
సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు
. ౯౬

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.
క.
కావున సత్యము మిక్కిలి , గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ, గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
౯౭
క.
క్షత్త్రవరుఁ డైన విశ్వా, మిత్త్రునకుఁ బవిత్రమైన మేనకుకున్ స
త్పుత్త్రి నయి బొంకువలుకఁగ, ధాత్త్రీతల నాధ యంత ధ ర్మేతరనే
. ౯౮

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.
వ.
అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.
క.
ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్
మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.
౧౦౦

నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?
క.
వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,
దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ ౧౦౦ --(పాఠాంతరము)

ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా!!
క.
పొడువునఁ బ్రాయంబునఁ గుఁ, గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు, నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందరు నగగాన్. ౧౦౧

పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా.
వ.
ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయినపలుకులు పలుకక నీ యాశ్రమంబునకుం బొమ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణ యై. ౧౦౨

ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపాన్నొందిన దై.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. ౧౦౩

పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.
ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.
వ.
ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. ౧౦౪
చ.
గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 105

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును తీసుకువచ్చింది.
Unknown
ఆంధ్రమహాభారతము-చతుర్థాశ్వాసము-

కణ్వుండు శకుంతలను దుష్యంతు పాలికిం బంపుట
వ.
మఱియు భార్య పురుషునం దర్ధం బగుటం జేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దన పురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుఁ బురుషుండు మున్న పరేతుండైనఁ బదంపడి తానును బ రేతయై తన పురుషుంగూడ నరుగునట్టి భార్య నవమానించుట యధర్మంబు మఱియుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున నఙ్గా దఙ్గా త్సమ్భవసి యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండును బుత్త్రుండును ననుభేదంబు లేదు. ౮౬
ఎంత బాగా వివరించిందో చూడండి. వేదశాస్త్రప్రమాణాన్ని కూడా ఉంటంకిస్తూ ధర్మా ధర్మ వివరణ చేసింది.
భార్య పురుషునిలో అర్ధభాగం. అందువల్ల ఆమె అతనికంటే ముందే మరణిస్తే ఆతని ఆగమనాన్ని ప్రతీక్షచేస్తూ పరలోకంలో ఆతనిని కలవటానికై వేచి ఉంటుంది. అలానే పురుషుడు ఆమె కంటే ముందు మరణిస్తే తరువాత ఆమె కూడా మరణించి తన పురుషుఢిని కూడటానికి వెళ్తుంది. అటువంటి భార్యను అవమానించటం అధర్మం. మఱియు పురుషుడే భార్యయందు ప్రవేశించి తిరిగి పుత్త్రుడిగా జన్మిస్తాడు. పురుషుని అంగాలనుంచే పుత్త్రుని అంగాలన్నీతయారయి పుడతాయి అనే వేదవచనం కూడా వుంది. అందుచేత జనకునికీ పుత్త్రునికీ భేదమే లేదు. అంతేకాదు ఇంకా విను.
క.
విను గార్హపత్య మనున,య్యనలము విహరింపఁబడి త దాహవనీయం
బన వెలుఁగునట్ల వెలుఁగును,జనకుడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతి తోడన్. ౮౭

గార్హపత్యమనే అగ్ని విహరింపబడి ఆ త్రేతాగ్నిలో జనకుడే తన నిజప్రకాశంతో తానే పుత్త్రునిగా వెలుగుతాడు.
క.
తాన తననీడ నీళ్ళుల, లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్సూను జనకుండు సూచి మ, హానందముఁ బొందు నతిశయ ప్రీతిమెయిన్. ౮౮

తండ్రి తన నీడను తాను నీళ్ళలో చూచుకొన్నట్లే ఆ కుమారుని చూసుకొని రెట్టించిన ప్రీతితో మహానందాన్ని పొందుతాడు.
వ.
పున్నామ్నో నరకా త్త్రాయత ఇతి పుత్త్ర యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షములవారి నుద్ధరించు గావున. ౮౯

ఇంకో వేద వచనాన్ని కూడా ఉదహరిస్తుందిక్కడ. పున్నామ నరకంనుండి దాటించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే పుత్త్రుడనబడతాడు. ఇది వేదవచనం. అటువంటి వాడు ఇరుపక్షాల్ని కూడా ఉద్ధరిస్తాడు. అందుచేత.
క.
నీ పుణ్యతనువువలనన, యీ పుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబు వలన నొండొక, దీపము ప్రభవించునట్లు తేజం బెసగన్. ౯౦

నీ పుణ్యమైన శరీరం నుండి, ఒక దీపాన్నుండి ఇంకో దీపం పుట్టినట్లుగా , మంచి తేజస్సుకలిగి నీ యీ కుమారుడు నీ నుండే పుట్టిన వాడై ప్రకాశిస్తున్నాడు చూడు. అంతే కాదు. చివరగా చెప్తున్నాను విను.
చ.
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాధ యీ పుత్త్రగా
త్త్రపరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూరసాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుం బుత్త్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. ౯౧

ఇంకా ఇంకా విపరీతమైన వాగ్వాదాలెందుకు, ఓ రాజా యీ నీ కొడుకు శరీరాన్ని ఓసారి కౌగలించుకుని చూడవయ్యా.
నీకే తెలిసిపోతుంది. ఎవరూ చెప్పనక్కర్లా. ఎందుచేతనంటే ఆ కౌగిలి సుఖము కంటె ముత్యాలహారం గాని కర్పూరం గానీ
దట్టమైన పుప్పొడి ప్రసరణం గానీ మంచిగంధం గానీ చంద్రుని వెన్నెల గానీ పుత్త్రుని శారీర కౌగిలింత కంటె ఎక్కువ హృదయాన్నలరించేవిగాను చల్లగానూ ప్రాణులకు ఉండవు సుమా. (ఇదే డి యన్ యే పరీక్ష కంటే కూడా నమ్మదగిన తార్కాణం. అందుచేత అటువంటి పరీక్షలవసరం లేదు)