Unknown
అర్జునుడు పేడి రూపమున విరటుఁ గొల్వ వచ్చుట
అర్జునుడు కొలువులోనికి రావటం ఎలావుందంటే
ఆ.
మంచుమఱుఁగువడినమార్తాండుఁడునుబోలె, నీఱు గవిసియున్న నిప్పుఁబోలె
వేషధారి యైన విష్ణుండుఁబోలె న, వ్విరటుకొలువు చేర నరుఁడు వచ్చె. 228
క.
కనుదెంచి పేడితనమును, వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా, జనులకుఁ దనుఁ జూపి మందసంచారమునన్. 229
క.
నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ, గన్నియలకు నాడ గఱపఁ గా నోపుదు వి
ద్వన్నుత మన్నామంబు బృ,హన్నల యేఁ బేడి ననుడు నత డిట్లనియెన్. 233
ఉ.
ఆయత బాహులున్ వెడఁద యైనసమున్నతవక్షమున్ సరో
జాయితలోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్ర మ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే. 234
కాయజున్ = మన్మధుని, కౌశికున్ = ఇంద్రుని
వ.
అనిన విని యమ్మహీపతికి బృహన్నల యి ట్లనియె.237
ఉ.
ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్త్వముం
బోఁడిమి దప్పి యున్నది నపుంసక జన్మ మవశ్యభోగ్య మై
వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మభావ్య మె
వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. 238
వ.
కావున.
తే.
ఒండు పనులకు సెలవు లే కునికిఁ జేసి, యభ్యసించితి శైశవ మాది గాఁగ
దండలాసకవిధమును గుండలియును, బ్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును. 240
సెలవు = ఉపయోగము, బ్రేరణి = కుండమీఁది నాట్యము

విరాటరాజప్పుడు తన కూతురు ఉత్తరను పిలిపించి ఆమెకు బృహన్నలను గురువుగా పరిచయం చేసి బృహన్నలకామెను అప్పగిస్తూ ఆమెతో ఇలా అంటాడు.
ఆ.
ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును, జెలియుఁ బరిజనంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్కకొఱఁతయు లే దిందుఁ, జేరి బ్రదుకు బుద్ధిగౌరవమున. 253
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-విరాట పర్వము
భీముడు వంటలవాఁడై విరటుఁ గొల్వ వచ్చుట
శా.
దేవా నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్
సేవాదక్షత నొండుమై నెఱుఁగ నీచిత్తంబునన్ మెచ్చున
ట్లే వండం గడు నేర్తు బానసమునం దిచ్చోటనే కాదు న
న్నేవీటన్ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులన్ జూచినన్. 217

భీముడు వంటలవాడి వేషంలో విరాటు కొల్వులోనికి ప్రవేశించి విరాట రాజుతో పై విధంగా అంటాడు. నేను శూద్రజాతికి చెందినవాడను. నాపేరు వలలుడు. మీకు వంటలు మంచి రుచిగా వండిపెట్టగలను. ఏవిధంగా చూచినా నన్నుమించిన వంటలవాడు ఎక్కడా కనిపించడు.
చ.
వలసిన నేలు మేను బలవంతుఁడఁ గారెనుఁబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమును లావు విద్య మెయి దర్పముఁ బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విఱుతున్ వడిన్ గడియలోనన చూడ్కికి వేడ్క సేయుదున్. 223
దలమును=ఆధిక్యమును
మీకు కావలిస్తే నాకుద్యోగమివ్వండి. నేను చాలా బలవంతుడను, ఎనుబోతులతోనూ, ఏనుగులతోనూ, పెద్దపులి, సింహం మొదలైన వానితోనూ పోట్లాడతాను, అంతేకాదు  పెద్ద పెద్ద మల్లురతో కూడా పోట్లాడి మీకు వినోదాన్ని కలిగిస్తాను అంటాడు.
ఇలా చెప్పేసరికి అతనికి విరాటుడు తన వంటశాలలో వంటల వారందరికీ పెద్దగా ఉద్యోగమిస్తాడు.
Unknown
శ్రీమదాంధ్ర మహాభారత పఠనాన్ని విరాట పర్వం తో మొదలు పెట్టాలంటారు పెద్దలు. అందుకని ఆది పర్వం పూర్తిచేసిన తర్వాత విరాట పర్వంలోనికి ప్రవేశిస్తున్నాను.
విరాట పర్వం ఫ్రథమాశ్వాసము-

పాండవులు థౌమ్యుని వీడికొని విరాట నగరం చేరతారు. వారి ఆయుధాలనన్నింటిని ఓ శమీ వృక్షం మీద భద్రపఱచి , ఆ ఆయుధాలు ధర్మరాజుకు అర్జునునకు మాత్రమే ఆ సంవత్సరకాలంలో కనిపించేలాను మిగిలిన వారికి అవి విషంతో కూడుకున్న పాములువలె కన్పించుగాక అని నియమించుకుంటారు. ఈ ఏర్పాటు భీముని దృష్టిలో ఉంచుకుని సమయభంగం కాకుండా ఉండాలని చేసుకున్నది. వారు విరాటరాజు కొలువున ఎలా మెలగాలన్నది కూడా నిర్ణయించుకుంటారు.
వారు వారిలో వారిని పిలుచుకోవటానికి వీలుగా మారు పేర్లను పెట్టుకుంటారు. ఆ మారు పేర్ల వివరాలు.
ధర్మరాజు--జయుడు
భీముడు--జయంతుడు
అర్జునుడు--విజయుడు
నకులుడు--జయత్సేనుడు
సహదేవుడు--జయద్బలుడు.
తరువాత ధర్మరాజు యమధర్మరాజు తనకు అరణ్యవాస సమయంలో ఇచ్చిన వరాన్ని(యక్షప్రశ్నలు ఘట్టంలో) పురస్కరించుకొని ప్రార్ధన చేయగా అతని అనుగ్రహంతో వారి వారి కనుగుణమైన రూపాలు వారికి సంప్రాప్తిస్తాయి.
ఆ రూపాలతో వారు ఒకరి తరువాత ఒకరుగా విరాటు కొల్వులోనికి ప్రవేశిస్తారు. ధర్మరాజు కంకుడు అనేపేరుతో విరటునిసభలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు విరాటుడతనితో
ఉ.
ఎయ్యది జన్మభూమి కుల మెయ్యది యున్నచోటు పే
రెయ్యది మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతం
బెయ్యది నాకు నంతయును నేర్పడఁగా నెఱిగింపుఁ డున్నరూ
పయ్యది నావుడున్ నరవరాగ్రణి కయ్యతిముఖ్యుఁ డిట్లనున్. ౧౯౦

మీ వివరాలనన్నింటిని చెప్పమని విరాటు డడుగుతాడు యతి రూపంలో వచ్చిన ధర్మరాజుని.
ఆ.
ఉన్నరూప పలుకునన్నరు లెక్కడఁ, గలరు తోఁచినట్లు పలుకు పలుక
నైనచంద మయ్యె నంతియకా కంత, పట్టి చూడఁ గలరె యెట్టివారు. ౧౯౧
ఉన్నరూపు+=యథార్థమునే
ఇలా చెప్పి ధర్మరాజు లౌక్యాన్నుపయోగించి కొన్నాడు ఇక్కడ.

వ. అని మందహాసంబు సేయుచు మఱియును. ౧౯౨
క.
నానావిధభూతమయము, మే నతిచంచలము మనము మేకొని నిక్కం
బేనరునకు జెల్లింపం, గా నగు సత్యంబు నడపుక్రమ మట్లుండెన్. ౧౯౩
మేకొని=పూని
సత్యము యొక్కరూపాన్ని గురించి చెప్పి తాను నిజం చెప్పకుండా దాటవేసాడాయన. ఎవరికీ కూడా పూర్తి సత్యాన్ని పలకడం సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడతాడు. అదీ ఆయన చాతుర్యం. ధర్మరాజుకు సఖుడననీ తనకు కొద్దిగా ద్యూతక్రీడ తెలుసుననీ ఓ ఏడాదిపాటాశ్రయం కావాలనీ తన పేరు కంకుడనీ చెప్పి ఆశ్రయం పొందుతాడు.
Unknown
ఆది పర్వము- అష్టమాశ్వాసము-2
వ.
అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 42
సీ.
ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు ని న్నెద్ది గఱపిరి నెమ్మితోడ

దానిన చేయుట ధర్మువు వారలకంటె హితుల్ నీకుఁ గలరె యొరులు

దుర్యోధనుండును దుశ్శాసనుండును గర్ణుండు శకునియుఁ గరము బాలు
గీ.
రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని, యట్టివారిపలుకు లాదరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా,రలకుఁ బ్రీతి నర్థరాజ్యమిమ్ము
. 43

విదురుడు ధృతరాష్ట్రునికి సరియైన విధానాన్ని బోధించాడు. ద్రోణుడు, గాంగేయుడు వీరిద్దరూ మధ్యస్థులు, నిజాన్ని పలికేవాళ్ళు, వయోవృద్ధులు, పాపానికి దూరంగా వుండేవారూను అందుచేత వారు చెప్పింది ఆచరించటం శ్రేయస్కరం. వారు చెప్పినట్లుగా పాండవులను పిలవనంపి వారికి అర్థ రాజ్యం ఇయ్యి. దుర్యోధనాదులు ఇంకా చిన్నవాళ్ళు, వారికి ఇది ధర్మం యిది అధర్మం అనేది సరిగా తెలియదు. అని సలహా ఇస్తూ ఇంకా పాండవుల గురించి ఇలా అంటున్నాడు.
మ.
తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై
శమితారాతిబలుండు వారలకుఁ బాంచాలప్రభుం డిప్ప్డు చు

ట్టము దా నయ్యెఁ దదాత్మజుం డయినధృష్టద్యుమ్నుఁడున్ వారితో

సమవీర్యుం డొడఁగూడె నిష్టసఖుఁ డై సంబంధబంధంబునన్
. 44
దార=తారు అ =వారే, శమితారాతిబలుండు=శత్రుబలము నణఁచినవాఁడు

పాండవులు మొదలే వారికి వారే పరాక్రమంలో ఎవ్వరికీ జయింపరానివారు, వాళ్ళకిప్పుడు శత్రుబలాన్ని అణిచిపెట్టినట్టి ద్రుపదుడు చుట్టం కూడా అయ్యాడు. ఆయనకొడుకు దృష్టద్యుమ్నుఁడు పాండవులతో సరిసమానమైన పరాక్రమ వంతుడు వారికి ప్రియసఖు డయ్యాడు చుట్టరికం మూలంగా.
మ.
బలదేవాచ్యుతసాత్యకుల్ దమకు నొప్పన్ మిత్రులుం గూర్చుమం
త్రులుఁ గా దైవము మానుషంబుం గలనిత్యుల్ నీకు దుర్యోధనా
దులకంటెం గడు భక్తు లెంతయు వినీతుల్ వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్. 45

బలదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్యకి తమకు కూర్చిన మంత్రులు, హితులు కాగా దైవము - మానుషమూ కల నిత్యులూ, దుర్యోధనాదులకంటె నీ యెడల అధికమైన భక్తి కలవారు అయిన పాండవులు నీ పుత్త్రులవంటివారే. వారిని దూరస్థులుగా ఉంచటం తగదు.
ఉ.
ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వారికి మార్కొనంగ ను
త్సాహము సేయఁ డన్న లఘుసారు లధీరు లసాహసుల్ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా. 46
వ్రచ్చుచోటన్ = చీల్చునెడ, మఘవుండు=ఇంద్రుడు

ఉ.
ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలు చున్నమా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్. 47
క.
తమ్ములయట్టుల తనకు వ,శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమును నొప్పఁగ బేర్మి ని,జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే. 48
వ.
వారలబలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె నీ పుణ్యమున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రదికిరి నీయందుఁ బురోచనదిగ్ధం బయినదుర్యశఃపంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము దుర్యోధనాపరాధంబున నఖిలమహీ ప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి నట్లు గా కుండ రక్షింపుమనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. 49
క.
నీవును భీష్ముఁడు ద్రోణుఁడు, భూవినుతవిశుధద్ధర్మబుద్ధుల రగుటన్
మీ వచనమున కనర్థము, గావింపఁగ నంత కార్యగతిమూఢుఁడనే. 50

ఇలా అని చెప్పి పాండవులను తన వద్దకు రప్పించుకొని ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చి ధర్మరాజును ఖాండవప్రస్థానికి పంపిస్తాడు.
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
ఉ.
అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్ జయింపఁగా
నిమ్మహి నోప రెవ్వరు నుమేశ్వరుఁ డట్టివరమ్ము వానికిన్
నెమ్మిన యిచ్చె గావున వినీతుఁడు వాయుసుతుండు మల్ల యు
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్. 162

క.
బలిమిమెయిఁ బార్థురక్షా,బలమును బవనసుతు బాహుబలమును నాని
ర్మలనీతిబలము నీకుం, గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా. 163

చ.
తడయక యేగి నీతిబలదర్పము లొప్పఁగ వాని డాసి క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁదిరిపున్ జయింతుము జగన్నుత న న్నెద నమ్ముదేని యి
ల్ల డ యిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్. 164

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధునిమీదకు యుద్ధానికి పోయేటప్పుడన్న మాటలవి.
దానికి ధర్మరాజిట్లా అన్నాడు.
చ.
ప్రియహితసత్యవాక్య యరిభీషణ కృష్ణ భవన్ని దేశసం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగుటేమి పెద్ద ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశుల నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁ బొందె నయకిల్బిషకీర్తి వెలుంగు చుండగన్. 166

చూడండి ధర్మరాజు వాక్యాన్ని ఎలా మొదలుపెట్టాడో. 'ప్రియహిత సత్యవాక్య' అని. అంటే చచ్చినట్లు ఆ పనిని నెరవేర్చుకొని రావలసిందే అని సూచన అన్నమాట.
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభాపర్వము-ప్రధమాశ్వాసము-2
భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు కలిగించుట
క.
ఆరంభరహితుఁ బొందునె, యారయసంపదలు హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ, తారంభులనోర్చు నెంతయధికుల నయినన్. 123

ఏ పనినీ ప్రారంభించని వాడిని సంపదలు చేరవు. హీనుడైనా సరే కృతప్రయత్నుడైన వాడు ప్రయత్నించని వారిని వారెంత అధికులయినా సరే ఓడించగలుగుతాడు.
క.
కడు నధికునితోడఁ దొడరినఁ, బొడిచిన నొడిచినను బురుషుపురుషగుణం బే
ర్పడుఁగాక హీను నొడుచుట, కడిఁదియె పౌరుషము దానఁగలుగునె చెపుమా. 124

తనకంటె అధికుడైన వానితో కలబడితే పురుషునకు మగతనం కానీ హీనుడిని అణచటం గొప్పా ? దానివల్ల పౌరుషం కలుగుతుందా చెప్పు.
జరాసంధుని మీదకు దండయాత్రకు పోవటానికి ఉద్యమిస్తూ భీముడు ధర్మరాజుతో పై విధంగా అంటాడు.
అప్పుడర్జునుడు--
క.
కులరూపగుణద్రవ్యం,బులు విక్రమవంతునందు భూవిదితము లై
నిలుచు నవిక్రమునకు నవి, గలిగియు లేనిక్రియ నప్రకాశంబు లగున్. 129

కులము, రూపము, గుణము, ద్రవ్యము --ఇవి విక్రమవంతుని యందు ప్రకాశించినట్లుగా అవిక్రమునందు ప్రకాశించవు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-
నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చిఇంద్రసభ, యమసభ, వరుణసభ, కుబేరుసభ, బ్రహ్మసభా వర్ణనలను చేస్తాడు. ఆ వర్ణనలలో పాండురాజు యమసభలో ఉన్నట్లుగాను హరిశ్చంద్రచక్రవర్తి దేవేంద్రసభలో ఉన్నట్లుగాను చెప్తాడు. అదివిని ధర్మరాజు నారదునితో
మధ్యాక్కర.
పరమధర్మాత్మకుఁ డయినపాండుభూపతిఁదొట్టి సకల
ధరణీశు లెల్ల యముసభ నుండంగఁ దా నేమిపుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁ డై యుండంగఁ గనియె.82
వ.
అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుండి ట్లని చెప్పె. 83
ఉ.
దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మ పరాయణుం డయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైక విభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రి కా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్. 84
సీ.
జయశీలుఁ డయి హరిశ్చంద్రుండు దొల్లి సప్తద్వీపములఁ దనబాహుశక్తిఁ
జేసి జయించి నిశ్శేషితశత్రుఁ డై ధారుణిలోఁ గలధరణిపతుల
నిజశాసనంబున నిలిపి నిత్యం బైన మహిమతో సకలసామ్రాజ్యమొప్ప
రాజసూయంబు తిరంబుగా నొనరించి తనరి యథోచితదక్షిణలకు
ఆ.
నేనుమడుఁగు లర్థమిచ్చి యాజకులఁ బూ,జించి భక్తితో విశిష్టవిప్ర
జనుల కభిమతార్థసంప్రదానంబులఁ,దృప్తి సేసె వంశదీపకుండు.85
వ.
వాఁడును బ్రాహ్మణవచనంబునం జేసి దేవేంద్రసాలోక్యంబు వడిసె నట్టిహరిశ్చంద్రుమహిమాతిశయంబు రాజసూయనిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో నిట్లనియె. 87
వైవస్వతసభన్=యమసభలో
చ.
కొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ యిందు నా
యునికియు రాజసూయమఖ మున్నతిఁ జేసినధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైనధర్మ నం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయగన్.89

నీవు మనుష్యలోకానికి వెళ్ళి నాకొడుకు ధర్మరాజుతో నా నరకనివాసాన్ని గురించి రాజసూయం చేసినవారి సంబంధుల స్వర్గనివాసస్థితిని తెలియజేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా అతనికి చెప్పి రాజసూయయాగం చేయమని నా మాటగా చెప్పమన్నాడు.
చ.
అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁడయి తమ్ములబాహుబలంబు పెంపునన్. 90

నాకొడుకులు దేవతాంశతో పుట్టినవాళ్ళు ధర్మరాజు రాజసూయాన్ని తమ్ముల సహాయంతో పూర్తి చేయగలడు
అని కూడా అన్నాడు.
వ.
అట్లేని నాకు నస్మత్పితృపితామహనివహంబుతోడ నాకాధిపలోకసుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు వచనంబు నీ కెఱింగించువేడుక నిట వచ్చితి. 91
క.
న్యాయమున రాజసూయము, సేయుము నీపితృగణంబుఁ జెచ్చెర నధిక
శ్రీయుత సురగణపూజ్యులఁ, జేయుము శక్రుసభ నుండఁ జేయుము వారిన్. 92

నీ తండ్రికి స్వర్గం ప్రాప్తించేలా నీవు రాజసూయయాగం చెయ్యి అని నారదుడు ధర్మరాజును ప్రేరేపిస్తాడు.
వ.
దిగ్విజయోపార్జితంబు లయినధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణ్యాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు(పూజ్యంబై యొప్పం) బ్రకాశింపుము మఱి రాజసూయంబు బహు విఘ్నంబు బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయు చుండుదు రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిలప్రజాప్రళయకారణం బయిన రణం బగునని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములం జూచి ధర్మ తనయుండు ధౌమ్యద్వైపాయనసుహృద్బాంధవమంత్రి సమక్షంబున నిట్లనియె.93

ధర్మరాజు నారదవచనప్రబోధితుండయి రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట
క.
పితృసంకల్పము సేయఁగ, సుతుల కవశ్యమును వలయు సుతజన్మఫలం
బతిముదమునఁ బితృవరులకు, హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్. 94
క.
పరలోకనిలయు లగుమీ, గురులకు దీనిన హితం బగున్ లోకభయం
కరసంగరమును గాలాం,తరమున నగునని విరించితనయుఁడు సెప్పెన్. 95
క.
పితృగణహితార్థముగ స,త్క్రతువొనరింపగ బుద్ధి గలదు ప్రజాసం
హృతి తత్క్రతువున నగు నని, మతి నాశంకయును గలదు మానుగ నాకున్. 96

ద్వైదీభావంలో పడ్డాడు ధర్మరాజు.ఓ ప్రక్క తండ్రులకు స్వర్గలోకప్రాప్తి, మరోప్రక్క ప్రజావినాశనం ఏదీ తేల్చుకోలేకుండా వున్నాడు.
వ.
ఏమి సేయుదు నని డోలాయమానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97
ఉ.
చేయుము రాజసూయ మెడ సేయక దాననచేసి దోషముల్
వాయు నిలేశ భూప్రజకుఁ బార్థివు లెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు సర్వసంపదలు చేకొనఁగాఁ దఱి యయ్యెఁ గౌరవా
మ్నాయలలామ నీ కెనయె మానవనాథులు మానుషంబునన్.98
వ.
అనిన వారలవచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుం డయి ధర్మరాజు రాజసూయంబు సేయసమకట్టి............
ఇక్కడ ధర్మరాజు వ్యక్తిత్వం కొంచెం దెబ్బతిన్నట్లనిపిస్తుంది నాకు. నిఖిలజన ప్రళయాన్ని కలిగించే యుద్ధం జరుగుతుందని ముందే తెలిసినా దానికివ్వాల్సినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా రాజసూయానికి పూనుకోవటం నాకంతగా నచ్చలేదు. అది అతని వ్యక్తిత్వానికి మచ్చగా నా కనిపిస్తుంది. నేను తప్పో కాదో నాకు తెలియట్లేదు.
Unknown
ఆదిపర్వము-అష్టమాశ్వాసము-1
ఆ.
కీర్తిలేనివానికిని జీవనంబు ని,రర్థకంబుచూవె యవనిమీఁద
నిత్యమయినధనము నిర్మల కీర్తియ, యట్టి కీర్తి వడయుట శ్రమంబె
31

పాండవులకు ద్రుపదుని తోడి చుట్టరికం వలన బలం పెరిగింది. ఇటువంటి సమయంలో వారిని నిర్జించటం ఎలాగ అని ఆలోచించిన దుష్టచతుష్టయం ధృతరాష్ట్రునితో మంతనం చేసి పాండవుల మీదికి దండెత్తుదామని నిర్ణయిస్తారు. ధృతరాష్ట్రుడు అందరితో ఆలోచించి చేద్దామని అందరినీ పిలిపించి అడుగుతాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో నా వరకూ నాకు కౌరవపాండవులిరువురూ సమానులే.పితృపైతామహంబయిన రాజ్యం నీకెట్లో వారికీ అట్లే . అందుచేత వారి అర్థరాజ్యం వారికివ్వటం మంచిది. అలా చేస్తే నీకు కీర్తి కలుగుతుంది అంటూ పై విధంగా అంటాడు. కీర్తిలేనివాని జన్మ వ్యర్థము. భూమి మీద నిత్యమయినది కీర్తి మాత్రమే. అటువంటి నిర్మలమైన కీర్తిని పొందుట తేలిక కాదు.
క.
ఇలఁ గీర్తి యెంతకాలము, గలిగి ప్రవర్తిల్లె నంత కాలంబును ని
త్యుల కారె కీర్తిగల పు,ణ్యులు కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే. 32

ఈ భూమి మీద కీర్తి యెంతకాలము కలిగి ప్రవర్తించితే అంత కాలము నిత్యులై వుంటారు. కీర్తి విహీనుడెక్కడా పూజనీయుడు కాడు.
వ.
కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గనరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధ ప్రణయుండ వయి కీర్తి నిలుపుమనిన భీష్ము పలుకులకు సంతసించి 33

ద్రోణాదులందరూ వారినే బలపరచగా ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చెదనని చెప్పి పాండవులను సగౌరవంగా ద్రుపదుని పురం నుండి హస్తినాపురానికి పిలిపిస్తాడు.
Unknown
ఆది పర్వము సప్తమాశ్వాసము

వశిష్ఠు వలనఁ కల్మాషపాదుండు శాపవిముక్తిఁ జెందుట
చ.
గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడు భక్తుండ వై సమస్త ధా
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖముండు మింక బ్రా
హ్మణుల కవజ్ఞ సేయక శమత్వము చేకొను మింద్రుఁడైన బ్రా
హ్మణుల కవజ్ఞ సేసి యవమానముఁ బొందుఁ ప్రతాపహీనుఁడై. 129

కల్మాషపాదుడు వశిష్ఠుని వలన శాపవిముక్తిని పొందిన తరువాత వానితో వశిష్ఠుడు పై విధంగా అంటాడు.

గుణములతో ప్రకాశిస్తూ బ్రహ్మణులకు భక్తుడవై సమస్త ధారుణి ప్రజలను పాలిస్తూ రోషాన్ని విడిచిపెట్టి ఇకనుంచి సుఖంగా ఉండు. బ్రాహ్మణులకు అవజ్ఞ సేయక శమత్వాన్ని పొందు. ఇంద్రుడి వంటి గొప్పవాడైనా బ్రాహ్మణులకు అవజ్ఞ చేసినచో్ ప్రతాపహీనుడై అవమానాన్ని పొందుతాడు.

మారు వేషంలో నున్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని దక్కించుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్జునునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. అలాగే శల్యుడు కూడా మారువేషంలో నున్నభీముని చేతిలో ఓడిపోతాడు. ఆ సందర్భం లోనివి ఈ పద్యాలు.
క.
నా యెదురఁ జక్క నై యని, సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం
తేయుఁ డగు విజయునకుఁ గా, కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్.200

ఆ.
పరశురాముఁడొండె హరుడొండె నరుఁడొండె, గాకయొరులు గలరె కర్ణునోర్వ
బలిమి భీముఁడొండె బలదేవుఁడొండె గా, కొరులు నరులు శల్యునోర్వఁ గలరె. 205

తరువాత అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తల్లికి భిక్షను తెచ్చామని నివేదించగా ద్రౌపదిని చూడకుండానే ఆమె మీరయిదుగురూ ఉపయోగించండని పలికింది. కుంతీదేవి మాట ప్రకారం పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడాలని తలుస్తారు. పాండవులు తమ స్వస్వరూపాల్ని తెలియజేసి ఆ విషయం ద్రుపదునికి తెలియ పరచగా అతడిలా అంటాడు.
క.
ఒక్క పురుషునకు భార్యలు, పెక్కం డ్రగు టెందుఁ గలదు పెక్కండ్రకు నా
లొక్కత యగు టేయుగముల, నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్. 244

ఒక పురుషునికి పెక్కుమంది భార్యలు ఉండటం సహజం కాని పెక్కండ్రకు ఒక్క కన్య భార్యగా వుండటం ఎక్కడా కనీ వినీ యెఱుగం అంటాడు.
అప్పుడు వ్యాసులవారక్కడికి వేంచేసి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతమంతా ద్రుపదునికి తెలియజేసి పాండవుల నైదుగురినీ ద్రౌపది పెళ్ళి చేసుకోవచ్చని చెప్తాడు. అప్పుడు ద్రుపదునితో వ్యాసులవారి సమక్షంలో ధర్మరాజిలా అంటాడు.
చ.
నగియును బొంకునందు వచనంబు నధర్మువునందుఁ జి త్తముం
దగులదు నాకు నెన్నఁడును ధర్ము వవశ్యము నట్ల కావునన్
వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం
దగ దను నీవిచారములు దక్కి వివాహమొనర్పు మొప్పుగాన్. 252
వ.
మఱియుం దొల్లి గౌతముం డయిన జటిలుఁ డను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును దాక్షాయణి యను ముని కన్యక యేక నామంబునఁ బ్రచేతసు లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్య యయ్యె ననియును గథల వినంబడు అని అంటాడు. తరువాత వ్యాసుల వారి అనుమతితో పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.
నగియును=పరిహాసమునకు
శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసం సమాప్తం.
Unknown
వశిష్ఠ విశ్వామిత్రుల వివాదము
ఆ.
పరులవలన బాధ వొరయ కుండఁగ సాధు, జనులధనము గాచు జనవిభుండు
కరుణ దప్పి తాన హరియించువాఁ డగు, నేని సాధులోక మేమి సేయు. 104

పూర్వం కన్యాకుబ్జాన్ని గాధిపుత్త్రుడైన విశ్వామిత్రు డనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడోసారి తన పరివారంతో సహా వేటకు వెళ్ళి అలసినవాడై వశిష్ఠాశ్రమానికి రాగా వశిష్ఠులవారు అతనికీ పరివారానికీ తన దగ్గఱనున్న నందిని అనే ధేనువు సహాయంతో షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేస్తాడు. విశ్వామిత్రుడు తాను ఆదేశపు రాజు కాబట్టి తనకా గోవు నిమ్మని అడిగి వశిష్ఠునిచే నిరాకరించబడతాడు. అప్పుడు తాను బలవంతంగా నైనా ఆ గోవును తనతో తీసుకెళ్ళగలనని పలికి విశ్వామిత్రుడు బలవంతంగా గోవును తనతో తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఆ సందర్భంలో చెప్పబడినది పై పద్యం.

రాజు సాధుజనుల ధనాన్ని రక్షించటం తన ధర్మంగా కలవాడు. అట్టి రాజు తానే కరుణ లేకుండా సాధుజనుల ధనాన్ని అపహరింప తలిస్తే సాధుజనులు పాపం ఏమి చేయగలుగుతారు అని భావం.

ఆ.
ఎట్టిరాజులును మహీసురో త్తము లెదు, రరగు దెంచునప్పు డధిక భక్తి
నెరఁగి ప్రియము వలికి తెరు విత్తు రిట్టిద, ధర్ము వీవు దీనిఁ దలఁప వెట్టు. 112

ఇక్ష్వాకుకుల సంభవుడైన కల్మాషపాదు డనే రాజు వేటకు పోయి అలసినవాడై వశిష్ఠాశ్రమమునకు వస్తూ వుంటాడు. దారిలో అతని కెదురుగా వశిష్ఠపుత్త్రు డైన శక్తి మహాముని వస్తూంటాడు. రాజు ననే అహంభావంతో కల్మాషపాదుడు ఆ మహా మునికి దారి ఇవ్వకపోగా తనకు దారి ఇవ్వలేదని అహంకారంతో తెరువు తొలగమని అంటాడు. అప్పుడు శక్తి మహాముని అతనితో పై విధంగా అంటాడు.

ఎటువంటి గొప్పరాజులైనా మహీసురోత్తములు (సద్బ్రాహ్మణులు) ఎదురుగా వచ్చుచున్నప్పుడు అధికమైన భక్తితో ఎరిగి వారికి ప్రియము పలికి దారి ఇస్తారు. ఇదే ధర్మం, కాని నీవు దీనిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు ? అని అడిగాడు. ఇటువంటి సూక్తులు భారతం నిండా కోకొల్లలుగా ఉన్నాయి. ఏరుకోవటమే మన కర్తవ్యం.
Unknown
ద్రౌపదీ స్వయంవరం
ఉ.
మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్క యింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నానరనాయకుండు విని యాతతశోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రి పురోహిత విప్రసన్నిధిన్. 22

పాండవులు కుంతీ సహితముగా లక్కయింటిలో అగ్నికి ఆహుతి అయ్యారని బ్రాహ్మణులు చెప్పగా విని ద్రుపదమహారాజు మిక్కిలి దుఃఖాన్ని పొందాడట. అర్జునునకు ద్రౌపది నిచ్చి వివాహం చేద్దామనుకున్నాను, ఇప్పుడెలాగ అని దుఃఖ పరవశుడై ఉన్న ద్రుపదునకు అతని పురోహితుడు నేను నుపశ్రుతిలో(ఓ రకమైన అంజనం లాంటిది) చూచాను, పాండవులు క్షేమంగానే ఉన్నారు. ద్రౌపదికి నీవు స్వయంవరం చాటించు, పాండవులు ఎక్కడవున్నా అప్పటికి తప్పక తిరిగి వస్తారు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పాడు. అలాగే ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని నిర్మింపజేసి దానిని ఛేదించినవానికి ద్రౌపది భార్య కాగలదని స్వయంవరం ప్రకటిస్తాడు. ఈలోగా పాండవులు ఏకచక్రపురాన్నుండి బయలుదేరి ద్రుపదుని పురానికి వస్తుండగా వారికి వ్యాసుల వారి దర్శనం లభిస్తుంది. వారిని చూచిన వ్యాసుడు వారితో ఇలా అన్నాడట.
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35
సీ.
తా నొక్క మునికన్య దనకర్మవశమునఁ బతి బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్యయై ఘోరతప మొనరించిన దానికి శివుఁడు ప్రత్యక్షమయ్యు
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన మని యేనుమాఱు లయ్యబల వేఁడె
న ట్లేని నీకు దేహాంతరంబునఁ బతు లగుదు రేవురు పరమార్థ మనియు
ఆ.
హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల, పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం, వరము సేయుచున్నవాఁడు వాఁడు.36
యుపేతదౌర్భాగ్య =దురదృష్టముతో కూడినది

ఓ మునికన్య తన కర్మవశాన్ని భర్తను బడయలేక పతి కొఱకై శివుని గూర్చి గొప్ప తపస్సు చేస్తుంది. శివుడామెకి ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా పతి దానమిమ్మని 5 సార్లు కోరుతుంది. తరువాతి జన్మలో నీకు 5గురు భర్తలు కలుగుతారని శివుడు అదృశ్యుడౌతాడు. ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టి పెరుగుతోంది. ఆమెకు తండ్రి స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరు ద్రుపదుని పురానికి వెళ్ళండి . మీకు శుభమౌతుంది. అని వ్యాసుడు తన దారిని తాను వెళ్తాడు.
పాండవులు ద్రుపదుని పురానికి వెళ్తూ దారిలో అంగారపర్ణుడనే గంధర్వుని అర్జునుడు ఓడిస్తాడు. ఆ గంధర్వుని నుండి హయములను గ్రహించి అతనికి తన అనలాస్త్రాన్ని ఇస్తాడు అర్జునుడు. ఆ గంధర్వుని అర్జునుడు నీవు మమ్ములను ఏల అదిరి పలికావని అడగ్గా అతడిలా అంటాడు.
ు.
ఇంతులగోష్ఠి నున్నయతఁ డెంతవివేకము గల్గెనేని న
త్యంతమదాభిభూతుఁ డగు ధర్మువు దప్పుఁ బ్రియం బెఱుంగఁ డే
నెంతవివేకి నయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్
వింతయె కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్. 59

ఆడవారిగోష్ఠిలో ఉన్న మగవాడు ఎంత వివేకి యైనా సరే అత్యంత మదాన్ని కలిగినవాడవుతాడు. వాడికిక ఒళ్ళూ పై తెలియదు . ధర్మాన్ని తప్పుతాడు. ప్రియాన్ని తెలుసుకోలేడు. నా పరిస్థితీ అదే , కాముని శక్తి పోగొట్టడం ఎంతవారికీ సాధ్యం కాదు గదా, అంటాడు అంగారపర్ణుడు.
Unknown
ఆది పర్వము-సప్తమాశ్వాసము-1
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35

ఈ వాక్యాన్ని వ్యాసులవారు పాండవులతో అన్నారు. పాండవులు ఏకచక్రపురాన్ని విడిచి పెట్టి ద్రుపదుని పురానికి వెళ్ళేదారిలో వారికి వ్యాసమహర్షుల వారి దర్శనం అవుతుంది. ఆ సందర్భంగా అన్నమాటలు ఇవి.
ద్రుపదునికి పుత్రకామేష్టి యజ్ఞం చేయగా అందు అగ్నిదేవుని వలన .
క.
జ్వాలాభీలాంగుఁడు కర, వాలబృహచ్చాపధరుఁడు వరవర్మ కిరీ
టాలంకారుఁడు వహ్నియ, పోలె రథారూఢుఁ డొక్కపుత్త్రుఁడు పుట్టెన్. 18
వ.
మఱియు. 19
తరలము.
కులపవిత్ర సితేతరోత్పలకోమలామలవర్ణి యు
త్పలసుగంధి లసన్మ హోత్పలపత్ర నేత్ర మదాలికుం
తులవిభాసిని దివ్య తేజముఁ దాల్చి యొక్క కుమారి త
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్. 20
వ.
ఇట్లు పుట్టిన కొడుకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జన వినుతంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి బ్రాహ్మణులం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేద పారగుం జేయించి యున్నంత నక్కన్య యిపుడు వివాహసమయ ప్రాప్త యయిన. 21
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-12
వ.
ఆ బ్రాహ్మణునికి గుంతి యిట్లనియె నయ్యా దీనికి సంతాపింప వలవ దీయాపద దలుగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడు కొక్కరుండ వాఁడును గడుబాలుండు బలిగొనిపోవ నర్హుండు గాఁడు నా కేవురు గొడుకులు గలరు వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొనిపోయెడు ననిన దాని విన నోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యిట్లనియె. 272
మధ్యాక్కర.
అతిధియై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు
హితముగా రక్కసువాతఁ ద్రోవ నెట్లొడంబడుదు
మతి నవమానింపఁగా దనిన విప్రుమరణంబు దలఁచు
టతిపాతకము పాతకములలో బ్రహ్మహత్యయుఁ బెద్ద. 273

మీరు మాకు అతిథులు. అలా అతిథులై వచ్చినవారిని నా కొరకై రక్కసుబారికి అప్పగించటానికి నేనెలా ఒప్పుకుంటాను. పాపాలన్నిటిలోకి విప్రుమరణము, అందులోనూ బ్రహ్మణ హత్య మరీ మరీ పాపము . అని అంటూ మనం మొదట్లో అనుకున్న విషయాన్ని చెపుతాడు.
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274
వ.
మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యొరులచేతం జేయబడుటం జేసి నాకుం బాతకంబు లేదు దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడనోప ననినఁ గుంతి యిట్లనియె. 275
క.
ఏనును దీనిన తలంచి మ,హీనుత విప్రవధ యెద సహింపక మఱి నా
సూను సమర్పించితి మ, త్సూను వధింపంగ రక్కసునకు వశంబే. 276
క.
ఖలు నసుర నోర్వనోపెడు, బలయుతుఁగా నెఱిఁగి కొడుకుఁ బంచితిఁ గా కి
మ్ముల శతపుత్త్రులు గల ధ,న్యుల కైన ననిష్టుఁ డగుతనూజుఁడు గలఁడే. 277
వ.
ఈతని చేతన తొల్లియుఁ బెక్కెండ్రసురలు నిహతు లయిరి వీఁడు మహా బలవంతుండు మంత్రసిద్ధుండని భీముం బిలిచి యీబ్రాహ్మణునాపదం దలిగి నాకు మనఃప్రియంబు సేయు మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంపం బూనె.
తరువాతది బకాసురవధ కథ.
ఆది పర్వము షష్టాశ్వాసము సమాప్తము.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
వ.
ఇట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డిట్లనియె. 266
సీ.
ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని మానుషంబునఁ దీర్పఁ రానిదాని
నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ ప్రోలికి నామడ నేల నల్ల
యమునానదీగహ్వరమున బకుం డనురక్కసుం డుండు వాఁ డక్కజముగ
నిందులకాఁపుల నందఱ దొల్లి యల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు
ఆ.
లగుధరామరేంద్రు లగణితజపహోమ, దానవిధులఁజేసి వానివలనఁ
గ్రమము వడసి యొక్క సమయంబుఁ జేసిరి, యొనర దాని తెఱఁగు వినుము తల్లి. 266
వ.
నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెండెనుపోతులం బూనిన శకటంబున నపరిమిత భక్ష్యపిశితమిశ్రాన్నం బునిచికొని పోయిన దానిని వానిని నయ్యెనుపోతులను భక్షించుచు. 268
పిశితమిశ్ర=మాంసముతోఁ గలిసిన
ఆ.
మనుజభక్షకుఁ డిదియ తనకు నప్పనముగా, నొరులవలనిబాధ వొరయకుండ
దీనిఁ గాచుచుండు నీనాఁటి రాజును, దలపఁ డసుర నోర్వ బలిమి లేమి. 269
ఉ.
పోలఁగ ధర్మ శీలుఁ డయి భూరిబలాధికుఁ డై న ధారుణీ
పాలకురక్ష మున్ వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో
నోలిన మేలుగాఁ బడసి యూళ్ళుల నున్నది యట్లు గానినా
డేల గృహస్థవృత్తి సుఖ మేగి వనంబున నున్కి కష్టమే. 270
క.
అరి యని విప్రులచేతను, ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె
వ్వరు నిప్పాపుఁడు మానిసి, నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్. 271
అరి=కప్పము
వ.
పెద్దకాలంబునకు నీయిలువరుస నేఁడు మాకు వచ్చె నిచ్చిఱుతవాని నారాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప నేన పోయెద నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యిట్లనియె.272
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
క.
మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైనయాపద్విషయం
బున సంతాపింపగాఁ, జన దని యెఱిఁగియును దగునె సంతాపింపన్. 254

మనుష్యులకు ఏ విధంగా నైనా దాటరాని ఆపద వచ్చినపుడు, బాధపడి లాభం లేదని యెఱిగినపుడు, భాధపడటం ఎందుకు?
వ.
ఆ రక్కసునకు నే నశనం బయ్యెద మీరు వగవకుండుఁడు భార్యయందుఁ బడయంబడునపత్యంబు నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక. 255
ఆ.
పురుషుకంటె మున్నుపరలోక మే గిన, సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత, యయ్యు జగము చేతఁ బ్రయ్యఁబడదె.256

భర్తకంటె ముందు చనిపోయిన భార్య నోచినదే నోము, భర్త లేని స్త్రీ పరమ పతివ్రత యైనా లోకములో దూషింప బడుతుంది గదా.
ఆ.
పడిన యామిషంబు పక్షు లపేక్షించు, నట్లు పురుషహీన యయినయువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు, రిదియుఁ బాపమనక హీనమతులు. 257

క్రిందపడిన మాంసాన్ని పక్షులపేక్షించినట్లుగా భర్తలేని యువతిని చూచి పాపమని తలచకుండా అందరూ హీనమైన మతి కలవారై తేలికగా కావాలనుకుంటారు.
ఆ.
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార, సంగ్రహంబుసేఁత శాస్త్రమతము
పతివిముక్త యయినసతి కన్యపురుష సం,గ్రహముసేఁత లోకగర్హితంబు.258

భార్య చనిపోయినవాడు తిరిగి వివాహం చేసుకోవటం శాస్త్రాలంగీకరించాయి. కాని భర్తపోయిన స్త్రీకి పునర్వివాహం లోకంచే నిందింపబడుతుంది.
వ.
కావున నేను భవద్విహీన నయి యొక్కనిముషం బేనియు జీవింప నేర నేర్చితి నేనియు నిక్కుమారుల రక్షింపనేర నెట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్ధించు నట్లు కులాచార సదృశులు గానివా రిక్కన్యం బ్రార్ధించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు మత్పరోక్షంబునం బునర్దారపరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబులు నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది యనుచు మరణ వ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె.259
గుణాధానము=మంచిగుణములు కలిగి ఉండేట్లుగా చేయటం
కొలది=శక్యము
ఆ.
ఒలసి యెంతకాల ముండిన నేను మీ, దానఁ గాను యొరులధనమ నన్ను
నెన్నఁ డయిన నొరుల కిచ్చుచో నసురకు, భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ. 260

ఎంతకాలం నేను మీతో కలసివున్నా నేను పరాయి యింటికి వెళ్ళాల్సిన దాన్నేగాని మీ సొమ్మును కాదుగదా. అందుచేత నన్ను రాక్షసుని కాహారంగా పంపండి నేను వెడతాను అంటుంది కూతురు.
వ.
మీకు నాయందయ్యెడు ద్రౌహిత్రలాభంబునకంటె మీరిద్దఱు జీవించిన ననేక పుత్త్రపౌత్త్రలాభం బగు దానం జేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు.262
తే.
బాలుఁడొక్కండు కొండొకకోల చేతఁ
బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి
చులుక వత్తు మీరేడ్వఁగావలవ దనుచుఁ
గలయ నూరార్చెఁ దన తొక్కుఁ బలుకు లొప్ప. 263

ఓ చిన్న బాలుడు ఆ రక్కసుని నేను ఛంపేసి తిరిగి వస్తాను మీరెవ్వరూ ఏడవకండి అని చేతిలో ఓ పుల్లను పట్టుకొని వూపుతూ తన చిన్న చిన్నపలుకులతో వారిని ఓదార్చేడట.
వ.
వానియవ్యక్తవచనంబులు విని యందఱు నేడ్పుడిగిన నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి. 264
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-10
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274

ఏకచక్రపురంలో బకాసురుని కాహారంగా కుంతి తనకుమారులలో ఒకరిని బ్రాహ్మణబాలునికి బదులుగా పంపిస్తానన్నపుడు ఆ గృహస్థు కుంతితో పై విధంగా అంటాడు. కథలోకి మనం వెళితే--

భీముడు కుంతితో ఇలా అంటాడు.
ఆ.
ఎఱిఁగి నాకుఁ జెప్పుఁడిదియేమి యెవ్వరి, వలన నింత య్యె వగవ నేల
యెంతకడిఁది యైన నిది యేను దీర్చి యీ, విప్రునకుఁ బ్రియంబు విస్తరింతు
. 246
వ.
అనిన గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247
పరిదేవనంబు=రోదనము
క.
నలసారము సంసార మ, ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం

చలము పరాధీనం బిం, దులజీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్.248
నలసారము=తృణమువంటి సారము గలది
ఈ జీవితం సారం లేనిది, దుఃఖాన్ని కలిగించేది, భయానికి స్థానం, చంచలమైనది, పరాధీనమైనది --తత్త్వవేత్తలయిన వారు దీనిని ఎలా నమ్ముతారు?
క.
ఆదిని సంయోగవియో, గాదిద్వంద్వములు దేహి యగువానికి సం
పాదిల్లక తక్కవు పూ, ర్వోదయకర్మమున నెట్టియోగికి నయినన్.
249
మొదటగా సంయోగవియోగాలనే ద్వంద్వాలు దేహికి తప్పవు. ఎటువంటి యోగికైనా సరే పూర్వజన్మకర్మలవల్ల ఇవి తప్పవు.
తరువోజ.
ఏనును బ్రజలును నీధర్మసతియు నేయుపాయంబున నిబ్బారిఁ గడవఁ
గానేర్తు మెయ్యది గర్జమిందుండఁగా దేగుదమయొండు గడ కని ముంద
రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది యిట్టి దారుణ మిమ్మెయిఁ జేయఁ
గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ గర్మవిపాకంబు గడవంగ లావె. 250

నేను నాపిల్లలు యీ నాభార్య యీ ఆపదనుంచి ఏ ఉపాయంతో గట్టెక్కగలం? ఇప్పుడేం చేయాలి ? మనం ఇక్కడుండొద్దు ఎక్కడికైనా వెళదామని నే ముందరే చెప్పాను, కాని యిది వినలేదు. ఇటువంటి దారుణం జరగాల్సి ఉండగా విధి ఎలా తప్పిస్తుంది? కర్మను తప్పించుకోవటం ఎవరి తరం !
సీ.
మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై ధర్మచారిణి యగుదాని వినయ
వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు భక్ష్యంబ వగు మని పనుప నేర్తు
ధర్మాభివృద్ధిగాఁదగు వడువునకు నీ నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన
యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు దౌహిత్రలాభంబు దలఁగ నెట్లు
ఆ.
దీనిఁ బుత్తు మఱి మదీయపిండోదక, నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు
వానిఁ బితృగణంబువలని ఋణంబుఁ బా,చినమహోపకారిఁ జిఱుతవాని. 251
మంత్రయుక్తముగా నన్ను పెళ్ళాడి నాకు సహధర్మచారిణి యై వినయశీలి, పుత్త్రవతి, అనువ్రత అయిన ఈమెను ఆ రాక్షసుని కాహారంగా ఎలా పంపను? ధర్మాభివృద్ధి కాగా నీ వడువునకు బ్రహ్మచే భార్యగా నీబడిన యీ కన్యను మనుమలనిచ్చే దానిని అతి బాలను ఎలా పంపించను ? నాకు తిలోదకదానాలు వదలాల్సిన వాడు కులదీపకుడు అయిన చిన్నకుఱ్ఱవానిని ఎలా పంపించగలను.
ఆ.
ఎట్టు సూచి చూచి యిది పాప మనక య, య్యసురవాతఁ ద్రోతు నదయవృత్తి
నరిగి యేన యిప్పు డసురకు నాహార, మగుదు వారిఁ బుచ్చ నగునె నాకు. 252

చూచి చూచి ఈ పాపం నే చోయలేను. నేనే ఆ అసురకు ఆహారంగా వెళతాను
వ.
అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-9
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్. 244

ఏకచక్రపురంలో పాండవులు తమ యింటి గృహస్థునకు కలిగిన కష్టాన్ని నివారించాలని కుంతి పాండవులకు చెపుతూ పై విధంగా అంటుంది.

పాండవులు జననీ సహితముగా వారణావతానికి వెళ్ళిన తరువాత దుర్యోధనునిచే నియమింపబడిన పురోచనుడు తాను నిర్మించిన చతుశ్శాలను వారికి చూపిస్తాడు. దానిలో వారు గృహప్రవేశం చేస్తారు. ధర్మరాజు ఆ గృహం లాక్షాగృహం అని గ్రహించి విదురుడు చెప్పిన ముందు జాగ్రత్త గుఱించి భీమునికి చెపుతాడు. భీముడు పురోచనునితో సహా ఆ గృహాన్ని వెంటనే తగలేద్దామంటాడు.

ధర్మరాజు అతడిని వారించి అలా చేస్తే భీష్మవిదురులకు కోపం రావచ్చని అగ్ని భయంతో మనం వేఱేచోటకు వెళ్ళితే మన ఆచూకిలోనే దుర్యోధనుడుంటాడు అనిచెప్పి అప్పటికా ఆలోచనని విరమింప చేస్తాడు. ఈలోగా విదురుఢు రాబోయే కృష్ణచతుర్దశినాటి రాత్రి లాక్షాగృహ దహనం జరుగుతుందని, జాగ్రత్తగా ఉండమని ఖనికు డనేవాడిని వారివద్దకు పంపి హెచ్చరిస్తాడు. ఖనికుడు పాండవులు క్షేమంగా బయటపడటానికి లాక్షాగృహం నుండి రహస్యమార్గాన్ని నిర్మించి పాండవులకది చూపించి జాగ్రత్తలు చెప్తాడు. పురోచనుడు పంపించిన నిషాద స్త్రీ తన ఐదుగురు పుత్త్రులతో లక్కయింటి ప్రక్కనే నిదురిస్తుండగా ఆ రాత్రి పురోచనుడు కూడా లక్కయింటిలోనే నిద్రిస్తుండగా భీముడు అర్ధరాత్రి సమయంలో పురోచనుని కంటె ముందే తాను మేల్కని లక్కయింటికి నిప్పుపెట్టి నిద్రిస్తున్న పాండవులను తల్లితో సహా తన భుజస్తంధాలమీద, చేతులతోనూ మోసుకుని రహస్య ద్వారం గుండా బయటపడి ఆవార్తను ఖనికుని ద్వారా విడురునికి చేరవేస్తాడు. లక్కయింటితో పాటుగా ఓక స్త్రీ ఐదుగురు మగవారు దహనమై పోవటంచేత పాండవులు , కుంతి చనిపోయారని అందరూ అనుకుని ఆ విషయం ధృతరాష్ట్రునికి చేరవేస్తారు. దుర్యోధను డావార్తవిని సంతోషపడతాడు. తన సేవకుడు పురోచనుడు కూడా ప్రమాదవశమున ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని భావిస్తాడు.

తరువాత నిద్రిస్తున్నపాండవులను తల్లిని భీముడు ఒక చెట్టుక్రిందికి చేర్చి వారికి నీళ్ళు తీసుకొని వచ్చి వారు తమంతట తాము మేల్కొనేదాక వేచి ఉందామనుకుంటాడు.

తరువాత కథ వ్యాసుడు వారిదగ్గఱకు వచ్చి వారికి హితోపదేశం చేసి రాగల కాలంలో ధర్మరాజు యుద్ధంలో కౌరవులను నిర్జించి సుఖంగా రాజ్యపాలన చేయగలడని కుంతీ దేవికి చెప్పి వారిని ఏకచక్రపురానికి వెళ్ళమని తరువాత తాను అక్కడికి వచ్చి వారిని తిరిగి కలుస్తానని చెప్పి వెళతాడు.

తరువాత భీమహిడింబల వివాహము, ఘటోత్కచుని జననము వగైరా జరుగుతాయి.

ఘటోత్కచుడు పుట్టిన వెంటనే పెద్దవాడయిపోయి తాను తన తల్లితో అరణ్యంలో నివసిస్తానని, పని కలిగినప్పుడు తనను తలచుకుంటే వస్తానని చెప్తాడు. తరువాత కుంతీ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ ఓ బ్రాహ్మణుని గృహంలో తల దాచుకుంటారు. ఓరోజు ఆ హ్రాహ్మణుని యింటినుండి రోదనలు వినిపిస్తే కుంతి వారికి వచ్చిన కష్టాన్ని తొలగించి వారికి సహాయం చేయటం తమ ధర్మమని పాండవులకు చెపుతూ ఈ విధంగా పలుకుతుంది.
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్ 244.

ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని గుర్తించగలగటం మంచి పని. మంచి మనసుతో దానికి సమంగా ఇతరులకు అవకాశం కలిగినపుడు తిరిగి ఉపకారం చేయటం మధ్యమమైనది. వారు చేసిన ఉపకారానికంటె ఎక్కువ ప్రత్యుపకారం మనం తిరిగి వారికి చేయటం ఉత్తమమం మనలాంటి చేయగలిగిన బుద్ధి కలిగిన వారికి.- అని కుంతీ దేవి తన పుత్త్రులతో అంటుంది.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-8
పాండవులు వారణావతంబునకు పోవుట
ఆ.
ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147

ఈ మాటల్ని ధర్మరాజు కుంతీదేవితో అంటాడు. ఆ సందర్భం యేమిటంటే....

ధృతరాష్ట్రుఁడు ధర్మరాజును యువరాజుగా చేసిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు (కణికనీతిని వినిన తరువాత) తండ్రితో-- వీరులైన వారని నేను పాండవులంటే భయపడుతూ ఉంటాను. దానికి తోడు నీవు ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా చేసావు. పైగా ప్రజలందరూ కూడా ధర్మరాజు గుణగణాలచే ఆకర్షితులైనవారై ఆతడే రాజు కావాలని ఆకాంక్షిస్తారు. అలా అతడు రాజైతే ఆతరువాత రాజ్యం వారివారి కుమారులకే చెదుతుంది. మాకు రాజ్యం దక్కదు. కావున నీవేదో ఒక ఉపాయం పన్ని పాండవులను ఈ చోటనుండి దూరంగా వెళ్ళేలా చెయ్యి అంటాడు. వారిని దూరంగా వారణావత నగరానికి పంపిస్తే మంచిదంటాడు. దానికి భీష్మ ద్రోణ విదుర అశ్వత్థామ కృపాచార్యులు మొదలగువారు ఒప్పుకోరేమో అని ధృతరాష్ట్రు డంటే వారందరూ ఒప్పుకుంటారు ఎలా అంటే అశ్వత్థామ నా కిష్టుడు నాతోనే ఉంటాడు , ద్రోణుడు కొడుకును వదలలేడు, బావ ద్రోణుడిని తన చెల్లెలిని విడువలేక కృపాచార్యులును నావద్దే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు, పాండవులతో వెళ్లడు, మనతోనే ఉంటాడు. విదురుడొక్కడూ ఏమీ చేయలేడు. అందుచేత పాండవులను వారణావతానికి పంపించమంటాడు. అందరూ వారణావతాన్ని గురించి బాగా పొగడేలా చేస్తాడు. దానితో పాండవులు కూడా దాని గురించి కుతూహులాన్వితు లవుతుంటారు. అలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి మీరు కుంతితోను మీ పరివారంతోనూ కలసి కొంతకాలం వారణావతంలో నివసించి తిరిగొస్తే బాగుంటుందని అక్కడకు వెళ్ళమని కోరతాడు. వారు దానికి ఒప్పుకుంటారు.

దుర్యోధనుడు విరోచనుడనే వాడిని ఒక లాక్షాగృహం పాండవులకొరకు వారణావతంలో నిర్మించమని పంపిస్తాడు. ఆ గృహంలో పాండవులు నిదురిస్తుండగా వారిని ఆ యింటితో సహా బూడిద చెయ్యాలనేది అతని సంకల్పం. విరోచనుడు అలాగే లాక్షాగృహాన్ని నిర్మిస్తాడు.

పాండవులు వారణావత గమనోన్ముఖులై నపుడు ప్రజలు ఇలా ప్రవర్తించారట.
సీ.
ఇప్పాండుపుత్త్రుల నేలొకో ధృతరాష్ట్రుఁ డేకత మనుపంగ నిచ్చగించె
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు లేల వారింపరో యెఱుఁగరొక్కొ
పితృపితామహూలచే భృతపూర్వమైక్రమాగత మైన రాజ్యంబుఁ గరము నెమ్మి
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
ఆ.
యేల వృద్ధరాజు లెడసేసిరో పార్థు, నరిగినెడక మనము నరిగి యతని
యున్న చోన ప్రీతి నుండుద మిందుండ, నేల యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి. 143

అలా ఆరోజుల్లో మంచివాడైన రాజుని అనుసరించి పోవటానికి ప్రజలు ఉత్సాహపడుతుండేవారు.
వ.
తనపిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయి వచ్చెద మని యందఱం గ్రమ్మఱించి చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి విదురుం డొరులు వినియును నెఱుంగ రానివచనంబుల బహుప్రకారవచన రచనావిశారదుండైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి కొడుకులం గౌఁగిలించుకొని కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱి చనియె నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యిట్లనియె. 144
తే.
విదురుఁడేతెంచి యొరులకువినియు నెఱుఁగ,గానియట్లుండఁ బలికినిన్ గఱపెబుద్ధి
నట్ల చేయుదు నంటి వీ వతనిమతము, సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పుమయ్య.145

విదురుడు ఇతరులు వినినా వారికర్థం కాని రీతిలో నీకేమిటో చెప్పాడు. నీవూ అలానే చేస్తానని అన్నావు. చెప్పేవిషయమైతే అదేదో చెప్పమని కుంతి ధర్మరాజుని అడిగింది.
వ.
అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె.146

ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147
వ.
కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమాదులరై యెఱుక గలిగి యుండునది యని బుద్ధి కఱపి మఱియు దుర్యోధనుచేసెడు దుష్క్రియలిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచద ననియె నని చెప్పిన విని విదురు బుద్ధికి దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచుఁ బాండవులు కతిపయి ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత. 148
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-7
కణికనీతి- కణికుడు దుర్యోధనునకు రాజనీతిఁ జెప్పుట
సీ.
ఆయుధవిద్యలయందు జితశ్రము లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును భయమందుచుండుదుఁ బాండవులకు
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ జేసె రా జే నేమి సేయువాఁడ
నృపనీతి యెయ్యది నిరతంబుగా మీర నా కెఱింగింపుఁడునయముతోడ
ఆ.
ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు సౌబలు,నాప్తమంత్రి నీతులందుఁ గరము
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు, నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. 101

ఆయుధవిద్యలలో స్థిరమైన పరిశ్రమచేసినవారు, యద్ధములో శూరులు, ఎప్పుడూ ఉత్సాహంగా వుండేవారూ, మంచిగర్విష్టులు అని పాండవులకు నేనెప్పుడూ భయపడుతూ ఉంటాను. ఆమీద రాజుగారు ధర్మరాజుని యిప్పుడు యువరాజుగా కూడా చేసారు. నేనేం చేయాలిప్పుడు? రాజనీతి ఏమి చెపుతుంది? మీరు నాకు మేలైనదేమిటో చెప్పండి. అన్నాడు దుర్యోధనుడు తన స్నేహితులతో. అప్పుడు నీతులలో ఆరితేరిన కణికుడనే శకుని కిష్టుడైన మంత్రి దుర్యోధనునికి ప్రీతి కలిగించగలిగేలా ఇలా అన్నాడు.

అమ్మవొడి బ్లాగు ద్వారా ఈ కణికనీతి ఈమధ్య బ్లాగులలో బాగా ప్రచారాన్ని పొందింది. అందుచేత మనం ఈ కణికనీతి ని గురించి అతని మాటలలోనే తెలుసుకోవటం చేద్దాం.
తరువోజ.
ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచితదండవిధానంబు దప్పక ధర్మ
చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
వరుసన తమతమవర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
నరిమిత్ర వర్జితుఁ డై సమబుద్ధి యగుమహీవల్లభు ననుశాశనమున. 102

రాజైనవాడు మొదటిగా దండనీతిని, ఉచితమైన దండవిధానాన్ని తప్పకుండా ప్రయోగిస్తూ ప్రజలందరూ మంచినడవడిక కలిగి మెలిగేలా రక్షిస్తూ మంచి వృత్తిని కలిగి వుండాలి. అలా అయితే దండభీతి వలన అన్ని వర్ణములవారూ- శతృవులూ, స్నేహితులూ అనే తేడా లేకుండా సమ బుద్ధి కలిగిన రాజు పరిపాలనలో వరుసగా తమ తమ వృత్తిధర్మా ల్నాచరిస్తూ బ్రతుకు సాగిస్తారు.
క.
గుఱుకొని కార్యాకార్యము, లెఱుఁగక దుశ్చరితుఁడయి యహితుఁ డగునేనిన్
మఱవక గురు నైనను జను, లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్.103

ఏది చేయదగినది, ఏది చేయరానిది అనేది తెలియకుండా దుశ్చరితుడూ అహితుడూ ఐన వాడు గురువే అయినా సరే ప్రజలందరికీ తెలిసేలా రాజు మంచిబుద్ధితో వానిని మఱచిపోకుండా యత్నించి శిక్షించాలి.
క.
ధీరమతియుతులతోడ వి, చారము సేయునది మును విచారితపూర్వ
ప్రారబ్ధమైన కార్యము, పారము బొందును విఘాతపదదూరం బై. 104

ముందుగా విద్వాంసులైన వారితో బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిర్వహించిన పని ఏ విఘాతాల్లేకుండా పూర్తవుతుంది.
క.
జనపాలుఁడు మృదుకర్మం,బున నైనను గ్రూరకర్మమున నైనను నే
ర్పున నుద్ధరించునది త, న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్. 105

రాజు మృదు కర్మకానీ క్రూరకర్మకానీ ఏదైనా సరే నేర్పుతో తాను అపాయాన్ని పొందకుండా ఉండేలా వుంటూ ధర్మాల్ని ఉద్ధరించాలి.
క.
అమలినమతి నాత్మచ్థి,ద్రము లన్యు లెఱుంగ కుండఁ దా నన్యచ్ఛి
ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే,శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై. 106

మలినముకాని బుద్ధితో తనతప్పులు యితరు లెఱుగకుండా యితరుల తప్పులను తాను బాగుగా తెలుసుకొనుచూ మిత్రులతో కూడినవాడై దేశ కాల పరిస్థితుల నెఱిగి ప్రవర్తించాలి.
క.
బలహీను లైనచో శ,త్రులఁ జెఱచుట నీతి యధికదోర్వీర్యసుహృ
ద్బలు లైనవారిఁ జెఱుపఁగ, నలవియె యక్లేశసాధ్యు లగుదురె మీఁదన్. 107

శత్రువు బలహీనుడైనచో అతనిని చెడఁ గొట్టటంనీతి. గొప్ప వీరులు మంచి బలవంతులైన వారిని చెడ చేయుట సాధ్యమా? మీఁద నట్టివారు మిక్కిలి కష్టంతో మాత్రమే సాధింపగలిగిన వారౌతారు.
క.
అలయక పరాత్మకృత్యం,బుల మది నెఱుఁగునది దూతముఖమునఁ బరభూ
ములవృత్తాంతము లెఱుఁగఁగఁ, బలుమఱుఁ బుచ్చునది వివిధపాషండతతిన్. 108

విసుగు చెందకుండా ఇతరుల మనస్సులలోని కార్యాలను తన మనసుతో తెలుసుకోవాలి. దూతల ద్వారా ఇతర భూముల వృత్తాంతాల్ని తెలుసుకోవటానికి వారిని వివిధములైన వేదబాహ్యమైన మార్గాల ద్వారానైనా సరే పలుమార్లు పంపిస్తుండాలి.
క.
నానావిహారశైలో,ద్యనసభాతీర్థదేవతాగృహమృగయా
స్థానముల కరుగునెడ మును, మానుగ శోధింపవలయు మానవపతికిన్. 109

వివిధములైన విహార, పర్వత, ఉద్యాన, సభా, తీర్థ, దేవతాగృహ, వేట ప్రదేశాలకు వెళ్ళునపుడు ముందుగానే ఆ యా ప్రదేశాలను రాజైనవాడు బాగుగా శోధింపించుకోవాలి.
తే.
వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ,దగరు నాఁగను వలవదు తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్లప్రొద్దు, నాత్మరక్షాపరుం డగునది విభుండు. 110

వీరిని నమ్మొచ్చు, వీరిని నమ్మకూడదు అనేదేం వుండకూడదు. తత్త్వబుద్ధితో ఎవ్వరినీ విశ్వసించకుండా యెప్పుడూ రాజు ఆత్మరక్షా పరుడయి వుండాలి.
ఉ.
ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
త్నమ్మునఁ జేయఁగా వలయుఁ దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము మంత్రవిభేద మైనఁ గా
ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁ బోలునే. 111

బాగుగా ఆత్మరక్ష చేసుకొనే విధంగా మంత్రాంగాన్ని ప్రయత్నంతో రక్షచేసుకోవాలి. అటువంటి పరిరక్షణ శక్తి వలన ఎల్ల కార్యాలు పరమార్థాన్ని సాధించుకోగలుగుతాయి. మంత్రవిభేదమైన కార్యాలు నిర్వహించటం బృహస్పతి కైనా సాధ్య మౌతుందా ?
క.
పలుమఱు శపథంబులు నం,జలియును నభివాదనములు సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ, గలయవి దుష్టస్వభావకాపురుషులకున్. 112

దుష్టస్వభావం కలిగిన కాపురుషులైనవారికి (చెడ్డవారికి) మాటి మాటికి శపథాల్ని చేయటం, నమస్కారాలు చెయ్యటం, అభివాదాలు చెయ్యటం, ప్రియంగా మాట్లాడటం, మిథ్యావినయం ఒలకబోయటం అనేవి ఉంటాయి.
క.
తన కి మ్మగునంతకు దు,ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కి మ్మగుడును గఱచును, ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రలచేన్. 113

తనకి సరియైన అవకాశం దొరికేంతవఱకూ దుర్జనుడు యిష్టుని వలె నటించి అవకాశం చిక్కగానే పామువలె గొప్ప దారుణమైన విషం కలిగిన పండ్లతో కాటు వేస్తాడు.
క.
కడునలుకయుఁ గూర్మియు నే,ర్పడ నెఱిఁగించునది వానిఫలకాలము పె
న్బిడుగును గాడ్పును జనులకుఁ, బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్.114

పెద్దపిడుగు పడుట, పెద్దగాలి వీయుట జనులకు ఎలా అనుభవంలోకి వస్తాయో అలాగే రాజుయొక్క కోపము, చెలిమి జనులకు అనుభవంలోకి వచ్చేలా వాటివాటి ఫలితాలు ఆ యా కాలములలో తెలిసేలా చేయాలి.
క.
తఱి యగునంతకు రిపుఁ దన, యఱకటఁ బెట్టికొని యుండునది దఱి యగుడుం
జెఱచునది ఱాతిమీఁదను, వఱలఁగ మృద్ఘటము నెత్తివైచినభంగిన్. 115

సమయము వచ్చేవఱకూ శత్రువును తన స్కందప్రదేశంలో అట్టి పెట్టుకొని ఉండాలి. సమయం వచ్చినపుడు వాడిని రాతిమీద మట్టికుండను వేసి పగులగొట్టినట్లుగా పగలగొట్టాలి.(నశింపజేయాలి).
క.
తన కపకారము మదిఁ జే,సినజనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన దొకయించుక ముల్లయి, నను బాదతలమున నున్న నడవఁగ నగునే. 116

ముల్లు చాలా చిన్నదయినా పాదంలో ఉంటే ఎలా నడవనివ్వదో అలానే తన కపకారము చేసిన మనుష్యుడు అల్పుడైనా సరే వాడిని చేకొని ఉండకూడదు.
క.
బాలుఁ డని తలఁచి రిపుతో, నేలిదమునఁ గలసి యునికి యిది కార్యమె యు
త్కీలానలకణ మించుక, చాలదె కాల్పంగ నుగ్ర శైలాటవులన్. 117

శత్రువైనవాడు బాలుడే కదా అని వానితో చులుకదనమున వ్యవహరించకూడదు. నిప్పురవ్వ చాలా చిన్నదైనా గొప్ప గొప్ప కాఱడవులను సైతము కాల్చివేయటానికి సరిపోతుంది కదా.
క.
మొనసి యపకారిఁ గడ నిడి, కొనియుండెడుకుమతి దీర్ఘ కుజశాఖాగ్రం
బున నుండి నిద్రవోయెడు, మనుజునకు సమానుఁ డగుఁ బ్రమత్తత్వమునన్.118

అపకారిని దగ్గరగా నుంచుకొనే మూర్ఖుడు జాగ్రత విషయంలో పొడవైన చెట్టు చిటారు కొమ్మమీఁద నిద్రించేటటువంటి మూర్ఖునితో సమానంగా నుంటాడు.
చ.
తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా
నొడివియు సత్య మిచ్చియుఁ జనున్ జననాథకృతాపకారులం
గడఁగి వధింపగా ననుట కావ్యమతం బిది గాన యెట్టులుం
గడుకొని శత్రులం జెఱుపఁ గాంచుట కార్యము రాజనీతిమైన్. 119

ఆలసింపక సామభేద దానోపాయములచేతను, దయతో నమ్మేట్లుగా పలికి, నిజం చెప్పి, రాజుకు అపకారం చేసినవారిని సంహరించటం చేయదగిన పని. ఏవిధంగా నైనా సరే శత్రువులను మట్టుపెట్టడమే రాజనీతిలో తగిన కార్యం.
వ.
కావున సర్వప్రకారంబుల నపకారు లయినవారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మ రక్షాపరుండ వయి దూరంబు సేసి దూషించునది యనిన కణికమతంబు విని దుర్యోధనుం డొడంబడి చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కి ట్లనియె. 120
















Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-5
కౌరవ పాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టఁ జనుట
ద్రోణుడు తన శిష్యులతో నాకు గురు దక్షిణగా ద్రుపదుని పట్టి తెండని అడిగాడు. అప్పుడు అదెంతపని అని తలచి కురుకుమారులందరూ పాంచాలపురాన్ని ముట్టడించారు.
పాండవులును రథంబు లెక్కి ద్రోణుం పిఱుంద నరిగి రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.
క.
వడిగొని కౌరవు లొండొరుఁ, గడవఁగ మును చనిరి వారిగర్వము సూడం
గడిమినిద్రుపదాధిపుతోఁ, బొడవఁగ దమ కలవి యగునె భుజవీర్యమునన్.
68
క.
అతగులచే ద్రుపదుఁడుబల, హితుఁ డై పట్టువడ నంతయల్పుఁడె శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా,న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్
. 69
అతగులచేన్=దుర్బలులచేత
కౌరవులందరూ వారి ప్రయత్నంలో విఫలమోతారు. ద్రుపదుడు వారందరినీ ఓడించగా పరాజయులై వెనక్కు తిరిగి వస్తారు .
వ.
ఇట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశర నిహత సురారికుమారులం బోలె వెఱచఱచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మనందనులకు నమస్కరించి మీర లింద .ుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద నని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్ర చరుండు గా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీ సముద్రంబు దఱియం జొచ్చిన. 76
ఘోరమైన యుద్ధం జరిగింది.
వ.
అట్టి మహా ద్వంద్వయుద్ధంబున విజిగీషుండయి పాంచాలుండు పాండవమధ్యము ధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన నలిగి వాసవసుతుం డుద్యతాహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుసింహంబునుం బోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాధ్వనులెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత. 87
క.
ప్రక్షీణదర్పు ద్రుపదు ర, థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు, దక్షిణ గా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్. 88
వ.
ద్రోణుండు నర్జునుచేసినపరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె. 89
క.
వీ రెవ్వరయ్య ద్రుపదమ,హారాజులె యిట్లు కృపణు లయి పట్టువడన్
వీరికి వలసెనె యహహ మ,హారాజ్యమదాంధకార మది వాసె నొకో. 90
ఆ.
ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ, యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచి పుచ్చె గురుఁడు విప్రులయలుకయుఁ, దృణాహుతాశనంబును దీర్ఘమగునె 91
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-5
సీ.
శూరులజన్మంబు సురలజన్మంబును నేఱులజన్మంబు నెఱుగ నగునె

మొగిని దధీచి యెమ్మునఁ బుట్ట దయ్యెనే వాసవాయుధ మైనవజ్ర మదియు
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన నాగ్నేయుఁడన రౌద్రుఁడనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె శర స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
తే.
కృపుఁడు ఘటసంభవుడుగాఁడె కీర్తిపరుఁడు, వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁబుట్ట
రై రె సత్క్షత్త్రియప్రభు లవనిఁ గావఁ, గడఁగి మీజన్మములు నిట్లకావె వినఁగ. 60

దుర్యోధనుడు అందఱి జాతకాలనూ బయటపెడుతూ భీముడితో యిలా అంటాడు. ఇంక కథలోనికి వస్తే..
క.
బృహదబ్ధిమేఖలాఖిల, మహీతలక్షత్త్రవరసమక్షమున మహా
మహిమాన్వితుఁగా నన్నును, మహీశుఁగాఁ జేసి తతిసమర్థత వెలయన్. 50

అందఱు రాజుల సమక్షంలో నన్ను రాజుగా ప్రకటించావు అని కర్ణుడు దుర్యోధనునితో అన్నాడు.
క.
దీనికి సదృశముగా మఱి, యే నేమి యొనర్తు నీకు నిష్టం బనినన్
మానుగ నాతోఁ జెలిమి మ,హీనుతముగఁ జేయు మిదియ యిష్టము నాకున్. 51

దీనికి బదులుగా నీకు నేనేమి యివ్వగలను అని కర్ణుడనగా నాతో స్నేహంగా వుండు అది చాలు అన్నాడు దుర్యోధనుడు.
వ.
అనిన విని దుర్యోధనునకు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్టసఖత్వంబున కొడంబడియె నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్ష పరవశుం డయి సూతుండు రథము డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ గర్ణుఁడును బితృగౌరవంబున సంభ్రమించి వినయవినమితోత్తమాంగుం డయిన. 52

ఇదంతా చూచి కర్ణుని పెంపుడు తండ్రి కర్ణుని దగ్గరకొచ్చాడు.
తే.
కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌగిలించి,కొని తదీయమూర్ధ్రాఘ్రాణ మొనరఁ జేసి.
యంగ రాజ్యాభిషేకార్ద్ర మైన శిరముఁ. దడిపె వెండియు హర్షాశ్రుతతులఁ జేసి.53
వ.
దానిం జూచి భీముండు గర్ణుని సూతకులసంభవుగా నెఱింగి నగుచు ని ట్లనియె. 54
క.
నీదుకులమునకుఁ దగఁగఁ బ్ర, తోదముగొని రథముగడపఁ దొడగుము నృపధ
ర్మోదయుఁ డగునర్జునుతోఁ, గా దనక రణంబు సేయఁ గా నీ కగునే. 55
వ.
మఱి యదియునుం గాక. 56
తే.
ఉత్తమక్షత్త్రియప్రవరోపభోగ్య, మైనయంగరాజ్యంబు నీ కర్హ మగునె
మంత్రపూతమైగురుయజమానభక్ష్య, మగు పురోడాశమదిఁ గుక్క కర్హమగునే.57

ఎంత దారుణ మైన మాటన్నాడు.
వ.
అనినం గర్ణుఁడు వెల్ల నయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాస వ్యాకులితవదనుం డయి
యాకాశంబు వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె నంత నంతివ్రీడితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవనమధ్యంబున నుండి దుర్యోధన మధాంధరగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. 58
క.
అనిలజ నీ కిట్లని ప, ల్కను దలఁపను నగునె లేడికడుపునఁ బులి పు
ట్టునె యిట్టిదివ్య తేజం, బునవాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా. 59

దుర్యోధనుడి సంబోధన చూడండి. అనిలజ అని ప్రారంభించాడు. భీమా అని అనలేదు.
సీ.
శూరులజన్మంబు సురలజన్మంబును నేఱులజన్మంబు నెఱుగ నగునె
మొగిని దధీచి యెమ్మునఁ బుట్ట దయ్యెనే వాసవాయుధ మైనవజ్ర మదియు
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన నాగ్నేయుఁడన రౌద్రుఁడనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె శర స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
తే.
కృపుఁడు ఘటసంభవుడుగాఁడె కీర్తిపరుఁడు, వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁబుట్ట
రై రె సత్క్షత్త్రియప్రభు లవనిఁ గావఁ, గడఁగి మీజన్మములు నిట్లకావె వినఁగ. 60
వ.
వానితోడిదేమి దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును బ్రకృతిపురుషుండు గాఁడు తనబాహుబలంబున నీయంగరాజ్యంబునక కాదు సకల మహీరాజ్యంబునకు నర్హుం డగు నను చున్నయంత నాదిత్యుం డస్తగతుం డైన నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు కర్ణుం దోడ్కొని కరదీపికాసహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ బాండవులును భీష్మ ద్రోణవిదురకృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61
ఆ.
కుంతి యంత సహజకుండలకవచాభి, రాముఁ గర్ణుఁ జూచి రవిసమానుఁ
బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమపుత్త్రస్నేహ, మెఱుక పడక యుండ నింతి యుండె. 62

ఇదే కొంప ముంచింది. కుంతి ఈ దాపరికమే అంతకూ కారణం అయ్యింది.
క.
వినుతధనుర్విద్యావిదు, ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలనిభయము సెడి ఱొ,మ్ముఁన జే యిడి నిద్రవోయె ముదితాత్ముం డై. 63

దుర్యోధనుడి కేమో అర్జునిని వలని భయం పోయి హాయిగా నిద్రపోయాడట ఆ రాత్రి.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-4
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47

కర్ణుడిని కృపాచార్యులు తన తల్లి దండ్రుల వివరాలు చెప్పమన్నప్పుడు దుర్యోధనుడు పై విధంగా అంటాడు.
మ.
జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ

ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్ విరో
చనుం డాత్మ ద్యుతి విస్తరించె సుతుపై సంప్రీత చేతస్కుఁ డై.
40
తత్ జీమూత యూథంబు=ఆ మేఘ సమూహము
తత్ ధ్వాంతతిరోహిత ఆపఘనుఁ డు ఐ=ఆ చీఁకటిచేఁ గప్పఁబడిన శరీరియై
కర్ణు డర్జునుని మీద పర్జన్యాస్త్రమేసాడు.
వ.
అయ్యవసరంబున దుర్యోధనుం దొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి భీష్మద్రోణకృపపాండవులు పార్థువలన నుండి రంత. 41
క.
రవిసుతపార్థులఘోరా, హవమునకును వెఱచు చున్న యది కుంతి తదు
ద్భవ ఘనతరశరతిమిరౌ,ఘ వృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్.
42

కర్ణార్జునుల ఘోరమైన ఈ యుద్ధం చూచి కుంతి మిక్కిలి యధికమగు బాణాంధకారముచేఁ గప్పబడిన దేహుడైన కొడుకును చూడగానక భయపడింది.
క.
ధృతిఁ దఱిఁగి మోహమూర్ఛా,న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా గతజీవఁ జేసె నప్పుడ, యతిశీతలచందనోదకా సేకమునన్. 43

కుంతి ధైర్యాన్ని కోల్పోయినదై మూర్ఛనొందగా వెంటనే విదురుఁడు ఆమెకు శీతలోపచారాలు చేసి ప్రాణం తిరిగి వచ్చిన దాన్నిగా చేసాడు.
వ.
అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవ నేసి యాదిత్యసమతేజుం డయి యున్న విదురదర్శితు లై న యక్కర్ణార్జులం జూచి కుంతి సంతసిల్లె నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వ యుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱనడుమ నిలిచి కర్ణున కి ట్లనియె. 44
చ.
కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుఁడు రాజధర్మ బం
ధుర చరితుండు నీ వితనితోడ రణం బొనరించెదేని వి

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు చెప్పినన్
దొర యగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్. 45
దొర=సాటి
అర్జునుడు కుంతీ పాండురాజుల సంతానం. రాజధర్మా న్నెఱిగిన వాడు. నీ వితనితో ద్వంద్వయుద్ధం చేయాలనుకుంటే నీ తలిదండ్రుల వివరాలు చెప్పు. సాటి వాడవయితె నీపై తన బలాన్నితడు చూపిస్తాడు.
వ.
అనిన విని కర్ణుండు తనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తల వాంచి యున్నం జూచి దుర్యోధనుఁడు గృపున కి ట్లనియె. 46.
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47
తే.
రాజవరు డైన పార్థుతో రాజు గాని, యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని నెల్లవారును జూడంగ నీ క్షణంబ, రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి. 48
వ.
అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడు మను బ్రాహ్మణవచనంబు వడసి కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండు మణిమకుట కేయూరహారాదిభూషణభూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమ హర్షంబు తోడం గురుపతి కి ట్లనియె. 49
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-3
వ.
కర్ణుండును జనుల నందఱ నదల్చి చొత్తెంచి రంగమధ్యంబున నిలిచి కలయం జూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి జలధరధ్వాన గంభీరరవంబున నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32
జలధరధ్వాన=ఉఱుము వంటి శబ్దము గల
క.
నీవ కడు నేర్పుకాఁడవు, గా వలవదు వీనిఁ గొన్ని గఱచితి మేమున్
నీవిద్య లెల్లఁ జూపుదు, మే వీరులుసూచి మేలుమే లని పొగడన్. 33
క.
అనిన నినతనయుపలుకులు, జనులకు విస్మయము సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును మఱి దుర్యో, ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్క్షణమాత్రన్. 34
వ.
అంత ద్రోణు చేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జును చూపినయస్త్రవిద్యావిశేషంబు లెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకునుహితంబుసేసి నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యం బుపయోగింపు మనిన నట్ల సేయుదునని కర్ణుం డొడంబడి యిమ్మూఁగిన రాజలోకంబును నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయవలయుననిన ధార్తరాష్ట్ర మధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డిట్లనియె. 35
క.
పిలువంగఁబడక సభలకు, బలిమిం జని పలుకుపాపభాగుల లోకం
బులకుఁ జన వేఁడి పలికెదు, పలువ యెఱుంగవు పరాత్మ పరిణామంబుల్. 36
పలువ=దుర్జనుఁడా!
పర ఆత్మ పరిణామంబుల్=ఇతరుల, తన-కొలదులు
క.
అనిన విని పార్థునకు ని, ట్లనియె నినాత్మజుఁడు దుర్బలాయాసక్షే
పనిబంధనమ్ములు వలుకక, ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడఁగుము నాతోన్. 37
క.
ఈరంగభూమి యస్త్రవి, శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు, వీరికిఁ గా దనువిచార విషయము గలదే. 38
విషయము=తావు
వ.
అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన. 39
Unknown
ఆదిపర్వము-షష్టాశ్వాసము-2
ఉ.
హారివిచిత్ర హేమకవచావృతుఁ డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు భాస్వదసితోత్పలవర్ణుఁడు సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగఁ బాండవమధ్యముఁ డొప్పె బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చి జనంబులు దన్నె చూడఁగన్. 17
హారివిచిత్ర హేమకవచావృతుఁ డు=ఇంపై వింతయైన బంగారు కవచముచేఁ గప్పఁబడినవాఁడు
ఉన్నతచాపచారుదీర్ఘోరుభుజుండు=పెద్దవింటిచేనందమై పొడవైన గొప్ప భుజములు గలవాఁడు
భాస్వదసితోత్పలవర్ణుఁడు=ప్రకాశించు నల్లకలువలవంటి చాయగలవాఁడు
సేంద్రచాపశంపారుచిమేఘమో=ఇంద్రధనస్సు మెఱపుకాంతితో గూడిన మేఘమా--అనేట్టుగా ఆ విధంగా రంగమధ్యమున నిలుచున్న పాండవమధ్యముడు (అర్జునుఁడు) జనులందరూ తననే చూస్తుండగా ఒప్పాడట.
క.
నరు నింద్రాత్మజు నింద్రా, వరజసఖున్ వీరుఁ బాండవ ప్రవరు ధను
ర్ధరుఁ జూచి చూప ఱెల్లం,బరమాధ్భుత చిత్తు లగుచుఁ బలికిరి తమలోన్. 18
ఇంద్రావరజసఖున్=కృష్ణుని మిత్రుని
ఆ అర్జునుని చూచి జనులందరూ తమలో తాము ఇలా అనుకున్నారట.
తే.
వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు, వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి, కడుపు చల్లగాఁ బుట్టిన ఘనభుజుండు. 19
ధర్మ=ధనుః
ఆవిధంగా జనులందరూ అర్జునుని పొగడుతున్నారట. ఆ పొగడ్తలు విని కుంతీ దేవి చాలా సంతోషాన్ని పొందినదట.
వ.
అయ్యర్జును స్తుతివచనంబు లొక్కట జనసంఘంబు వలన నెగసి వియత్తల విదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం డిది యేమి రభసం బని విదురునడిగిన నాతం డి ట్లనియె. 22
రభసంబు=కలకలము
క.
భూరిభుజుం డర్జునుఁ డతి, శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న, వారితముగఁ బొగడుజనరవంబిది యధిపా. 23

తన విలువిద్యా ప్రదర్శన చేయటానికై రంగప్రవేశం చేసిన అర్జునుని అవారితముగా పొగడుతూ జనులు చేస్తున్న కలకలమిది మహారాజా అని విదురు డతనికి చెప్పాడు.

అర్జునుండు దన యస్త్రవిద్యాకౌశలంబు చూపుట

వ.
అని పొగడు చుండ నర్జునుం డాచార్యు ననుమతంబున నస్త్రలాఘవ వై చిత్ర్యప్రకాశనపరుం డయి యెల్లవారును జూచు చుండ. 26
సీ.
ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున భూప్రవిష్ణుం డగుభూరిఘోర
శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుఁ డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
తే.
దానదృశ్య దేహుండగుఁదత్క్షణంబ, హ్రస్వుఁడగు దీర్ఘుఁడగు సూక్ష్ముఁడగు రయంబు
తోడ రథమధ్యగతుఁడగు ధూర్గతుండు, నగు మహీతలగతుఁడగు నద్భుతముగ. 27

ఆగ్నేయాస్త్రంతో అతిభీకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింపనలవికాని జలాన్ని, అనిలాస్త్రంతో అధికమైన వాయువును, మేఘాస్త్రంతో మహాగొప్పవైన మేఘసమూహాన్ని- పుట్టించాడట. అంతేకాక భూమ్యాస్త్రంతో భూమిలోనికి ప్రవేశించినవాడుగాను, మహా ఘోరమైన శైలాస్త్రంతో పెద్దపర్వతరూపాన్ని దాల్చాడు. ఇవన్నీ కూడా అదృశ్యమైన అస్త్రాలసాయంతో జరుగుతున్నాయట. తాను అదృశ్యమైన దేహం కలవాడుగాను, ఆ క్షణంలోనే పొట్టివాడుగాను, మరుక్షణంలో పొడుగ్గాను, ఒక క్షణం దీర్ఘమైనవాడుగాను, మరో క్షణంలో సూక్ష్మమైన వాడుగాను ఒకసారి రథం మధ్యలో ఉన్నవాడుగాను, ఇంకో క్షణంలో భూమిమీద నిల్చున్నవాడుగాను ఇన్నిన్ని రకాలుగా ప్రత్యక్షమౌతూ అందరినీ అద్భుతంగా అలరించాడు అర్జునుడు తన ధనుర్విద్యతో.
వ.
మఱియుం బాఱెడు సింహవ్యాఘ్రవరాహాది మృగంబుముఖంబులం దొక్కొక్క యమ్మేసి నట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు రజ్జుసమాలంబితంబయిన గోశృంగంబునం దేకవింశతి శరంబులు వరుసన నాట నేసియు ని ట్లస్త్రవిద్యా వైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయు చున్నంతఁ గర్ణుండు నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన. 28
మ.
జను లెల్లం గడు సంభ్రమింపఁగ నజస్రం బై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబయో
యన వీతెంచినఁ బాండవుల్ సనిరి ద్రోణాచార్యు డాయన్ సుయో
ధను వేష్టించిరి తమ్ములందఱును దద్ద్వారంబు వీక్షించుచున్. 29
వ.
అంత. 30
శా.
సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్
బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణ వర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణ పూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్. 31

సాలప్రాంశు=మద్దివలె నెత్తైనవానికిని
నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్=ఉజ్జ్వలమైన సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్నవాడు
బద్ధోగ్రనిస్త్రింశు=గ్రహించిన భయంకర ఖడ్గముగలవానిని
అటువంటి కర్ణుని చూచి జనులందరూ ఆశ్చర్యపోయారట. పాండవులందరూ ద్రోణుని ప్రక్కకు చేరగా కౌరవులందరూ దుర్యోధనుని ప్రక్కకు చేరారట.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-1
కుమారాస్త్ర విద్యాసందర్శన కథాప్రారంభము
క.
ఘోరాస్త్రశస్త్రవిద్యల, నారూఢములందు నిపుణు లైరి కుమారుల్
మీరలు వీరలవిద్యా, పారముసను టెఱుఁగ వలయు భవదీయసభన్.3

కుమారులందఱూ అస్త్రశస్త్రనిద్యలలో ఆరితేరారు. మీరో సభచేసి వీరి విద్యాపారాన్నిచూడాల్సింది అని ద్రోణుఁడు ధృతరాష్ట్రునితో అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుని ఆనతి మేరకు విడురుడు రమ్యమైన సభను అన్నివిధాలా అలంకరించి ఏర్పాటు చేయగా ఓ రోజు గాంధారీ సహితముగా ధృతరాష్ట్రుడా సభకు బంధుజనంతో సహా వచ్చి ఆసీనుడయ్యాడు.
తే.
సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క, నెతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్త్రి, కెలన నుండె నున్మీలితనలిననేత్ర. 6

కుంతీదేవి కూడా సుతుల ధనుర్విద్యాప్రదర్శనము చూచు వేడ్కతో గాంధారి ప్రక్కన కూర్చుని ఉన్నది.
ద్రోణాచార్యులవారు అశ్వత్థామతో సహా రంగమధ్యమున ప్రవేశించాడు.
శా.
ద్రోణాచార్యుపిఱుంద నొప్పి కృతహస్తుల్ బద్దగోధాంగుళి
త్రాణుల్ మార్గణపూర్ణతూణులు మహాధన్వుల్ కుమారుల్ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగాన్. 10
బద్దగోధాంగుళిత్రాణుల్=కట్టుకొనబడిన ఉడుముతోలు చేతి కవచములు గలవారు.
ధర్మరాజుమొదలుగా గల కుమారులందరు వారివారి వయస్సుల ప్రకారము బారులు తీరి ద్రోణుని ప్రక్కన వచ్చి వరుసగా నిలబడ్డారు.
గురువుగారి అనుమతి ప్రకారం అందరూ తమ తమ విద్యలను వరుసగా ప్రదర్శించసాగారు.

భీమ దుర్యోధనులు తమగదాకౌశలంబు చూపుట
మ.
అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్ర భై
రవహుంకారరవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లఁ బాం
డవ కౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థ మై భావిపాం
డవ కౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాకృతిన్. 14
వియత్ ఆగారం=ఆకాశ గృహము
అకాండప్రోత్థ మై=కారణము లేక కలిగిన దై
వారి గదాయుద్ధం అతిభయంకరమై భావి భారత కౌరవ రణానికి సూచనగా అనిపించినదట.
క.
ఆరాజసుతులవిద్యా, పారగపటుచేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి, ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచు నుండెన్.15
పరువడిన్=క్రమముగా
వ.
అంత భీమదుర్యోధనులగదాకౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామం బంచి వారి నిద్దఱ వారించి వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి నా ప్రియశిశ్యుం డయిన యర్జునుధనుఃకౌశలంబుఁ జూడుం డనిన నయ్యాచార్యువచనానంతరంబున. 16


Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-18
ద్రోణుఁ డస్త్రనిద్యం దనశిష్యులఁ బరీక్షించుట.
వ.
అక్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు గృత్రిమం బయిన భాసం బనుపక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి దాని నందఱకుం జూపి మీమీ ధనువుల బాణంబులు సంధించి నా పంచినయప్పుడ యప్పక్షితలఁ దెగ నేయుం డే నొకళ్ళొకళ్ళన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీవృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనా నంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె. 248
తే.
వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము, దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ
యనిన నిమ్ముగఁ జూచితిననిన వెండి, యునుగురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి. 249
క.
జననుత యామ్రానిని న,న్నును మఱి నీ భ్రాతృవరులనుం జూచితె నీ
వనవుడుఁ జూచితి నన్నిటి, ననఘా వృక్షమున నున్న యవ్విహగముతోన్. 250
వ.
అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీ దృష్టి చెదరె నీవు దీని నేయ నోపవు పాయు మని యవ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేననకులసహదేవులను నానాదేశాగతు లయిన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందరనందనుం బిలిచి వారి నడిగినయట్ల యడిగిన నర్జునుం డి ట్లనియె. 251
క.
పక్షిశిరంబు దిరంబుగ, నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ,క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్. 252
వ.
ఇట్లశ్రమంబునఁ గృత్రిమపక్షితలఁ దెగ నేసినయర్జునునచలితదృష్టికి లక్ష్యవేదిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె నంత. 254
లక్ష్యవేదిత్వంబునకు=గుఱినిగొట్టుటకును
క.
మానుగ రాజకుమారుల, తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థమరిగి యందు మ,హానియమస్థుఁ డయి నీళు లాడుచు నున్నన్. 255
క.
వెఱచఱవ నీరిలో నొ, క్కెఱగా నొకమొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు, చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్. 256
వెఱచఱవన్=భయపడఁగా
ఒక్కెఱగాన్=ఉగ్రముగా
చిఱుదొడ=పిక్క
క.
దాని విడిపింపఁ ద్రోణుఁడు, దా నపుడు సమర్థుఁ డయ్యుఁ దడయక పనిచెన్
దీని విడిపింపుఁ డని నృప,సూనుల శరసజ్యచాపశోభితకరులన్. 257
శరసజ్యచాపశోభితకరులన్=బాణముల నెక్కుపెట్టిన విండ్లచేఁ బ్రకాశించు చేతులు గలవారిని
శా.
దానిన్ నేరక యందఱున్ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానం గానిశరీరముం గలమహోగ్రగ్రాహమున్ గోత్ర భి
త్సూనుం డేనుశరంబులన్ విపులతేజుం డేసి శక్తిన్ మహా
సేనప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగాన్. 258
గోత్ర భిత్సూనుండు =అర్జునుఁడు
మహాసేనప్రఖ్యుఁడు=కుమారస్వామి వలెఁ బ్రసిద్ధుఁడు
వ.
అమ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్న దేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి ద్రోణుం డర్జును ధనుఃకౌశలంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగు నని తనమనంబున సంతోషించి వానికి ననేకదివ్యబాణంబు లిచ్చె నని యర్జును కొండిక నాఁటి పరాక్రమగుణ సంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పెనని. 259
ఆది పర్వము పంచమాశ్వాసము సంపూర్ణం.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-17
ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట
మహాభారతంలోని అనేకానేక ఉపాఖ్యానాల్లో ఇది ఒకటి. ద్రోణుని వ్యక్తిత్వం ఈ కథలో మసకబారింది.
వ.
మఱియు గదా కార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబుల యందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహా ప్రసిద్ధి విని హిరణ్యధన్వుండను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యా గ్రహణార్థి యయి వచ్చిన వాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొనకున్న వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231
ప్రాసాసి=?
తే.
వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి, దానికతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి, నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.
232
క.
ఇటఁ బాండవకౌరవు లొ,క్కొట నందఱు గురుననుజ్ఞ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి, పటుతరజవ సారమేయభటనివహముతోన్. 233

పాండవులు కౌరవులు కలసి భటులతోను, వేటకుక్కలతోను వేటకు బయల్దేరారొకసారి.
వ.
మఱియు నం దొక్క భటునికుక్క తోడుదప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యు సమీపంబున మొఱింగిన నయ్యెలుంగు విని దానిముఖంబునం దేను బాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁడేసిన నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ. 234
ఉ.
తేజిత బాణహస్తు దృఢదీర్ఘమలీమసకృష్ణ దేహుఁ గృ
ష్ణాజిన వస్త్రవిష యా ప్తవిషాదు నిషాదుఁ జూచి యా

రాజకుమారు లందఱుఁ బరస్పర వక్త్రవిలోకన క్రియా

వ్యాజంబునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.
235
వ.
అక్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 236
క.
వినుఁ డే హిరణ్యధన్వుం, డనువనచరనాథుకొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును, ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్.
237
వ.
అనిన విని కురుకుమారు లందఱు మగిడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డొక్కనాఁ డేకాంతంబున నాచార్యున కి ట్లనియె. 238
క.
విలువిద్య నొరులు నీ క, గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలికితిరి నాక కా దీ, త్రిలో కముల కధికుఁ జూచితిమి యొక యెఱుకన్. 239
క.
నా కంటెను మీకంటెను, లోకములో నధికు డతిబలుండు ధనుర్వి

ద్యా కౌశలమున నాతఁడు, మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా. 240
వ.
అనిన ద్రోణుం డదరిపడి వానిం జూతము రమ్మని యర్జునిం దోడ్కొని యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేగిన నెఱింగి వాడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి యేను మీశిష్యుండ మి మ్మారాధించి యివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచి యున్నం జూచి ద్రోణుం డట్లేని మాకు గురుదక్షిణ యిమ్మనిన సంతసిల్లి వాఁ డి ట్లనియె. 241
క.
ఇదె దేహం బిదె యర్థం, బిదె నాపరిజనసమూహ మిన్నిటిలో నె
య్యది మీకిష్టము దానిన, ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘంబనినన్. 242
క.
నెమ్మిని నీదక్షిణహ, స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి మ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన, యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్. 243
తే.
దక్షిణాంగుష్ట మిచ్చిన దానఁ జేసి, బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁడయ్యెఁ, బార్థునకు మనోరుజయు బాసెనంత. 244
దక్షిణాంగుష్టము=కుడి బొటన వ్రేలు
క.
విలువిద్య నొరులు నీక,గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపుసుతునకుఁ బలికిన, పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్. 245
బలరిపుసుతునకున్=అర్జునునకు
మత్తకోకిలము.
భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుం డిలన్. 246
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-16
మత్తకోకిలము.
వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధన మోపఁ డేనియు వీనిమాత్రకు నాలుగేన్
పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచు నుండగాన్. 218

మత్తకోకిలము- నడక ఎంత అందంగా వుంటుందో కదా.

కనీసం పిల్లాడికి పాలనిమిత్తం నాలుగు పాడి పశువులనన్నా ఇయ్యకపోడు గదా అనే ఉద్దేశంతో వెళ్ళాడు పాపం.
వ.
అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన నాతండు దనరాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక యేను రాజును నీవు పేదపాఱుండవు నాకును నీకును ఎక్కడిసఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి నని దన వృత్తాంతం బంతయు జెప్పిన. 219
పాఱుడు=బ్రాహ్మణుడు
క.
విని రోయుతీఁగ గాళ్ళం, బెనఁగె గదా యనుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్
ఘనభుజు నభీష్టపూజా, ధనధాన్యవిధానముల ముదంబునఁ దనిపెన్. 220

వెతుకుతున్నతీగ కాళ్ళకు తగిలింది గదా అనుకుని భీష్ముడు ద్రోణుని అన్నివిధాలా ఆదరించి
చ.
మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు వీరిఁ
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్య లెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలఁడు ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. 222

మనమల కందరికీ విద్య గఱపమని కోరుతూ ద్రోణుడిని ఎటువంటి పొగడ్తతో భీష్ముడు ఆకట్టుకున్నాడో చూడండి. పరశురాముడుకూడా యుద్దంలోనూ నైపుణ్యంలోనూ పరాక్రమం లోనూ నిన్ను పోలడని విన్నాను-అదీ మాట నేర్పంటే.
వ.
అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండు వారలం జేకొని యందఱ కి ట్లనియె. 223
తే.
అస్త్రవిద్యలు గఱచి నాదైన ఇష్ట, మొగిన తీర్పంగ నిందెవ్వఁ డోపు ననినఁ
బాయమొగమిడి కౌరవుల్ పలుకకుండి, రేనుదీర్చెద ననిపూనె నింద్రసుతుఁడు. 224

గురువును ఆకట్టుకోవటం అంటే అదీ. ఆవిద్య అర్జునిడికి మాత్రమే తెలుసు. అందుచేత వెంటనే ఆమాటన్నాడు.
వ.
ఇట్లు తనయిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానా దేశంబులం గలరాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోఁ గలసి కఱచుచుండిరి(మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె) అంత. 225
కర్ణుడు కూడా నానాదేశ రాజులతో పాటుగా ద్రోణుని దగ్గర విద్య నేర్చుకున్నాడా అనే సందేహం కలుగుతున్నది నాకు.
క.
నరుఁ డస్త్రవిద్యా, పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ, బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. 226
వ.
అయ్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీకటి నాతం డేయనేర కుండ వలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడువం బెట్టకుమీ యనిపంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయు చున్న నొక్కనాఁటిరాత్రి యందు. 227

చీకటిలో అన్నం తినటం అలవాటయితే ధనుర్విద్యను కూడా చీకటిలో అదేవిధంగా నేర్చుకోవచ్చన్నమాట.
ఉ.
వాసవనందనుండు గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బోవుడు భోజన క్రి యా
భ్యాసవశంబునం గుడిచి పన్నుఁగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.228
పటుమారుతాహతిన్= మిక్కిలి గాలి దెబ్బచేత
క.
పాయక చీఁకటియందును, నేయం దా నభ్యసించె నిట్టియెడం గౌం
తేయు ధనుర్జ్యాధ్వని విని, ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్.228

శిష్యుల విద్యాపరిశ్రమ చూస్తే ఏ గురువుకైనా ముచ్చట వేస్తుంది కదా.
సీ.
ఆతనియస్త్రవిద్యాభియోగమునకుఁ బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
యన్న ధనుర్ధరు లన్యులు నీకంటె నధికులు గా కుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా నని పల్కి ద్వంద్వసంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథమహీవాజివారణములపై నుండి దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ
తే.
బహువిధవ్యూహభేదనోపాయములను, సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటిభార్గవుఁడు వింట, నిట్టిఁడే యని పొగడంగ నెల్ల జనులు.229
అభియోగమునకున్=పూనికకు

అలా విలువిద్యలో అర్జునుని అందరికంటె ప్రవీణు డయ్యేలా విద్య గఱపాడు ద్రోణుఁడు.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-15
ద్రోణుఁడు హస్తి పురంబునకు వచ్చుట
చ.
ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుం డగువానితోడ మూ
ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్ రణశూరుతోడ భీ

రునకు వరూథితోడ నవరూథికి సజ్జనుఁతోడఁ గష్టదు

ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే.
204

ఇంకా ఇలా ధనపతితో దరిద్రునకు తత్త్వవిదునితో మూర్ఖునకు ప్రశాంతునితో క్రూరునకు పరాక్రమవంతునితో భీరునకు కవచముగల వానితో అదిలేనివానికి మంచివానితో చెడ్డవానికి ఏవిధంగా సఖ్యము కుదురుతుంది అని కూడా ద్రుపదుడు ద్రోణునితో అన్నాడు.
క.
సమశీలశ్రుతయుతులకు, సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా, హము నగుఁ గా కగునె రెండు నసమానులకున్. 205

శీలము, ధనము, చరిత్ర సమంగా కలవారి మధ్య సఖ్యము, వివాహము సంభవం కాని అవి అసమానులమధ్య జరగవు కదా.
వ.
మఱి యట్లుం గాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధంబులు సంభవించుం గావున మాయట్టిరాజులకు మీయట్టి పేదపాఱువారలతోఁ గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేర దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది నేరక పుత్త్రకళత్రాగ్నిహోత్రశిష్య గణంబులతో హస్తిపురంబునకు వచ్చె నంత నప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందఱు గందుక క్రీడాపరులయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడి. 206
ఆ.
నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ, మొక్కొ యనఁగ వెలుఁగుచున్న యపుడు
రాచకొడుకు లెల్లఁ జూచుచు నుండిరి, దానిఁ బుచ్చుకొనువిధంబు లేక. 207
వ.
అట్టి యవసరంబున . 208
క.
నానావిధశరశరధుల, తో నున్నతచాపధరుఁడు ద్రోణుఁడు వారిం
గానఁ జనుదెంచి యంతయుఁ, దా నప్పు డెఱింగి రాజతనయుల కనియెన్. 209
శరధులతోన్=అమ్ములపొదులతోడను
ఉన్నతచాపధరుఁడు=పొడుగు విల్లును ధరించినవాఁడు
చ.
భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్రవిద్యలం
గరము ప్రసిద్ధుఁ డై పరఁగు గౌతము శిష్యుల రిట్టిమీకు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపిండు గొనంగ లేకయొం
డొరులమొగంబు చూచి నగు చుండఁగఁ జన్నె యుపాయహీనతన్. 210
పిండున్=బంతిని
గౌతము శిష్యులు అనటం జరిగిందేమిటి? కురు పాండు పుత్రులు కృపాచార్యుని శిష్యులు కదా. కృపాచార్యులు శరద్వంతుని కుమారుడు గౌతముని మనవడు కదా.
వ.
దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ డీవిద్య యొరు లెవ్వరు నేరరని ద్రోణుం డొక్కబాణం బభిమంత్రించి దృష్టిముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొక బాణంబున నేసి వరుసన బాణ రజ్జువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారులెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెఱింగించిన నాతండును. 211
దృష్టిముష్టి సౌష్టవంబు=చూపు పిడికిళ్ళ నేర్పు చేత
పుంఖంబు=పిడి
క.
ఎందుండి వచ్చి తిందుల, కె దుండఁగ నీకు నిష్ట మెఱిఁగింపుము స
ద్వందిత యని యడిగిన సా, నందుఁడు ద్రోణుండు భీష్మునికి ని ట్లనియెన్. 213
వ.
ఏ నగ్ని వేశుం డనుమహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదం బభ్యసించు చున్ననాఁడు పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డనువాఁడు నాకిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి యేను పాంచాల విషయంబునకు రాజయిననాఁడు నాయొద్దకు వచ్చునది నారాజ్య భోగంబులు ననుభవింప నర్హుండవని నన్నుఁ బ్రార్థించి చని పృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రా జయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక తేజస్వి నాత్మజుం బడసి ధనంబు లేమిం గుటుంబ భరణంబునం దసమర్థుండ నయి యుండియు. 214
విషయంబునకున్=దేశమునకు
గౌతమి అంటే కృపాచార్యుని చెల్లెలయిన కృపి యేనా?
క.
పురుషవిశేషవివేకా, పరిచయు లగు ధరణిపతులపాలికిఁ బోవం
బరులందు దుష్ప్రతిగ్రహ, భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్. 215
పురుషవిశేష వివేక అపరిచయులు=గొప్పవారిని వివేకము నెఱుఁగని వారలు
దుష్ప్రతిగ్రహ=చెడ్డ దానమును గొనుట
క.
ధనపతులబాలురు ముదం,బున నిత్యముఁ బాలు ద్రావఁ బోయిన నస్మ
త్తనయుండు వీఁడు బాల్యం, బున నేడ్చెను బాలు నాకుఁ బోయుం డంచున్. 216
వ.
దానిం జూచి దారిద్ర్యంబునకంటెఁ గష్టం బొండెద్దియు లేదు దీని నా బాలసఖుండగు పాంచాలుపాలికిం బోయి పాచికొందు నాతండు దనదేశంబున కభిషిక్తుండు గాఁ బోవుచుండి నన్ను రాఁ బనిచి పోయె. 217