Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౪

సాళ్వుఁడు భీష్మునితో యుద్ధము సేయుట


శంతన మహారాజుకు సత్యవతి వలన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు. ఈ ఇద్దరూ పెద్దవ్వకుండానే శంతనుడు పరలోకగతు డౌతాడు. భీష్ముఁడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేస్తాడు. అతడు మిక్కిలి చంచలుడై ఎవ్వరిని లెక్కచేయక సుర దనుజ మనుజ గంధర్వాదులను ఆక్షేపిస్తూండేవాడు. దానికి అలిగి చిత్రాంగదు డనే పేరు కలిగిన గంధర్వరాజు అతనితో యుద్ధానికి వచ్చి మాయా యుద్ధంలో చిత్రాంగదుడిని చంపివేస్తాడు. అప్పుడు భీష్ముఁడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేస్తాడు. ఈ విచిత్రవీర్యుడు యౌవనవంతు డయిన ఆతనికి పెళ్ళిచేయాలని భీష్ముఁడు సంకల్పించి కాశీరాజు ముగ్గురు కూతుళ్ళను వారి స్వయంవరానికి వెళ్ళి బలవంతంగా తీసుకొస్తాడు.
క.
నాయనుజునకు వివాహము , సేయగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డం బగువా, రాయతభుజశక్తి నడ్డ మగుఁ డాజిమొనన్. ౧౯౯

నా తమ్మునికి వివాహం చేయటం కొఱకై ఈ ముగ్గురు కన్యలను బలవంతంగా తీసుకుపోతున్నాను. ఎవరైనా అడ్డుకోదలిస్తే యుద్ధంలో నన్ను అడ్డుకోవచ్చు.
వ.
బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిది వివాహములయందు క్షత్త్రియులకు గాంధర్వ రాక్షసంబు లు త్తమంబులు స్వయంవరంబున జయించి వివాహంబగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగిన రాజలోకంబు నెల్ల నోడించి యిక్కన్యలం దోడ్కొని నా చనుట యిది ధర్మంబ యని కాశిరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు. ౨౦౦

గాంధర్వ రాక్షస వివాహాలగురించిన ప్రసక్తి ఇదివరకు శకుంతలోపాఖ్యానంలో కూడా చదివాము.

ఎదిరింపవచ్చిన రాజులనందరినీ భీష్ముఁడు యుద్ధంలో ఓడిస్తాడు. వాని పిఱుంద సాల్వుడనురాజు సమరసన్నద్ధుండై సనుదెంచి భీష్మునితో భీకరమైన యుద్ధం చేసి ఓడిపోయి వెనుదిరిగి తన రాజ్యమునకు వెళ్తాడు.
క.
రథమును రథ్యంబులు సా, రథియును వృథ యైన భగ్నరథుఁడై భాగీ
రథి కొడుకు చేత విమనో, రథుఁడై సాల్వుండు నిజపురంబున కరిగెన్. ౨౧౧

ఈ 'థ' అనుప్రాస యెంత అందగించిందో గమనించండి.

ఈవిధంగా పరాక్రమ లబ్ధలైన అంబ, ఆంబిక, అంబాలిక లను దోడ్కొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబు సేయ నున్న నందు బెద్దయది యైన యంబ యి ట్లనియె. ౨౧౨
ఆ.
పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ, దండ్రిచేతఁ బూర్వదత్తనైతి
నమ్మహీశునకు నయంబున నెయ్యది, ధర్ము వెఱిఁగి దానిఁ దలఁపు మిపుడు. ౨౧౩
వ.
అనిన విని భీష్ముండు ధర్మ విదులైన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజునకిచ్చి పుచ్చి మహోత్సవంబున నయ్యిరువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన. ౨౧౪

అంబ తాను సాల్వునకు తండ్రిచే పూర్వదత్తనైతినని చెప్పగా అమెను సాల్వుదగ్గరకు పంపించి మిగిలిన యిద్దరికి విచిత్రవీర్యునితో వివాహం జరిపిస్తాడు భీష్ముఁడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment