Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౮
ఇంద్రుడు నహుషుతేజోవిశేషంబు చూచి మఱుఁగువడుట.
శచీ దేవి నహుషునితో కొంతకాలం గడువు కోరివచ్చిన పిదప అందరూ కలసి ఆలోచించుకొని విష్ణుదేవు పాలికి రహస్యంగా పోయి సహాయం కోరగా ఇంద్రునిచే అశ్వమేధ యాగం చేయిస్తే అతని పాపం నశిస్తుందని సలహా యిస్తాడు. అలా అశ్వమేధ యాగం చేసి పాపాలను పోగొట్టుకొని ఇంద్రుడు నహుషుని వద్దకు వెళ్ళి ఆతని తేజస్సు చూచి భయకంపితుడై పారిపోయి ఎక్కడో దాగుకొంటాడు.
శచీ దేవి ఆకాశవాణిని ప్రార్థించి ఆకాశవాణి సహాయంతో ఇంద్రుని కలసి నహుషుని పోకలు అతనిని తాను గడువు కోరటం వగైరా తెలియజేస్తుంది.అప్పుడామెతో ఇంద్రుడు
క.
ఆ నహుషు బాహుగర్వ మ,నూనం బై యున్నయది సముజ్జ్వల మునిస
న్మాన ప్రవృద్ధ మగుటను, దానం గాలంబు వేచెదను జయమునకున్.౧౭౫
సముజ్జ్వల మునిసన్మాన ప్రవృద్ధము=ప్రకాశించు మహర్షుల యాదరముఁ బెరిగినది.
చ.
తఱి యగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపినయట్ల చేయుము తగం జని యాతనిఁ గాంచి నన్ను నె
త్తెఱఁగున నైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ మునివర్గవాహనుఁడ వై చనుదెమ్మను మంతఁ దీరెడున్.౧౭౬

సమయం వస్తే గాని యేమీ చెయ్యలేం. నిన్ను పొందాలని అతనికుంటే మునివర్గాన్ని వాహనంగా చేసుకొని రమ్మని చెప్పు. అని శచీ దేవికి చెప్తాడు.
శచీదేవి నహుషుడిని అలానే కోరగా దానికి సమ్మతించి సప్తర్షిగణ వాహన సమేతుడనై వస్తానని చెప్పి అలానే రావటానికి ప్రయత్నిస్తాడు.
శచీ దేవి బృహస్పతిని రక్షింపవేడగా అతడు అగ్నిదేవుడిని పిలిచి ఇంద్రుని వెదికి రమ్మని పంపిస్తాడు. అగ్ని అన్నిచోట్లా వెదకి ఇంద్రుని జాడ కనుక్కోలేక తిరిగివచ్చి బృహస్పతితో ఇలా అంటాడు.
వ.
-----నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింప నేరనైతి నప్పుల వలన నగ్నియు బ్రాహ్మణులవలన క్షత్రియజాతియు నశ్మంబులవలన లోహంబును నుద్భవించె వాని వాఁడిమి యెల్ల యెడలనుం జెల్లుఁ దమతమ జన్మస్థానంబులయం దడంగుం గావున నీళ్ళు నాకు సంక్షయంబు సేయుట ప్రసిద్ధంబనిన విని యనిమిషగురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని.౧౮౫
అశ్మంబులు=ఱాళ్ళు
బృహస్పతి అగ్నికి తన మంత్రబలంచే అన్నిచోట్లకు వెళ్ళే వీలు కలిగించగా అగ్ని తిరిగివెళ్ళి ఇంద్రుని వెదకి పట్టుకుంటాడు. అక్కడికి మునులందరితో కలసి వెళ్తారందరూ.బృహస్పతి ఇంద్రునితో
క.
శరనిధి ఫేనంబున నా, హరి పొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దా
బరిమార్ప నీకు విజయము, దొరకొనియెం గాక దీన దోసము గలదే.౧౯౦
వ.
అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి----౧౯౧
------నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున.౧౯౭
క.
కష్టుం డగునానహుషుఁడు, నష్టాత్మకుఁ డయ్యె దివిజనాయక నీయు
త్కృష్ట చరితమున సురలకుఁ, దుష్టిగ నిజరాజ్యసంగతుఁడ వగు మనుచున్.౧౯౮
కష్టుండు=పాపి
క.
మునివరుఁ డైన యగస్త్యుఁడు, చనుదెంచిన శతమఖుండు సమ్మతి నుచితా
సనమిడి యర్ఘ్యముఁబాద్యము, నొనరిచి యిట్లనియె సవినయోక్తి నతనితోన్.౧౯౯

అగస్త్యు డింద్రునకు నహుషుభ్రష్టత దెలుపుట.
వ.
అనిన విని యమ్మునీంద్రుండి ట్లనియె నన్నహుషుని మోచివేసరుచున్న మునులతనికడ గోష్టీవినోదంబుల నుండి బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందు జెప్పఁబడి యుండునవి నీకుఁ బ్రమాణభూతంబు లగునే యని యడిగినం బాపనిశ్చయుం డై యతం డమ్మంత్రంబులు బ్రమాణంబులుగావనిన నే నమ్మాట నిషేధించి పూర్వాచార్యులచేత నభినందితంబు లగు మంత్రంబుల నిందించుట యజ్ఞానం బని వివాదంబు సేసిన నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నిన నతనిం గనుంగొని పుణ్యహీనుండును దేజో(హాని)దీనుండును నగుట యుపలక్షించి నీవు పూజనీయు లయిన మహామునుల నిన్ను వహింపంబనిచితి వారలు కొనియాడుమంత్రంబుల గర్హించి తదియుంగాక నన్ను నవమానించితి గావున నింద్ర పదభ్రష్టుండ వై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగంబ వై యుండు మని శాపం బిచ్చి పదంపడి యనుగ్రహించి భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డవుపెంపు గలిగి యుథిష్ఠరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు బడయు వాఁడ వనిన దత్క్షణంబ,౨౦౧
క.
స్వర్గ పద భ్రష్టుం డై , దుర్గతికిం బోయె నతఁడు దుశ్టాత్ములకున్
దౌర్గత్యము సుజనులకు, న నర్గళసద్గతియు నగుట యరుదే యెందున్.౨౦౨

ఈవిధంగా ఇంద్రుడంతటివానికే కష్టములు పడక తప్పలేదు.
క.
కావున మీపడినయర,ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి, నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.౨౦౮

అని శల్యుఁడు ధర్మరాజుతో పలికెను.


పర్వములు | edit post
0 Responses

Post a Comment