Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-5
ఉ.
ఇమ్ముగ సర్వలోక జనులెవ్వనియేనిముఖమృతాంశుబిం
బమ్మున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్ర మ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యు మ్ముని నప్పరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.76

ప్రసిద్ధిగా సర్వలోక జనులు ఎవ్వని చంద్రబింబమువంటి ముఖాన్నుండి
వెలువడే భారతవాగమృతమును చెవి రంధ్రమనే అంజలిని పట్టి త్రాగుతారో
అట్టి మునీంద్రుడు, లోకముచే పొగడబడ్డ- పరాశరసుతుడైన వ్యాసునికి
మిక్కిలి భక్తితో ప్రణమిల్లి--రోమహర్షణుడు భారతగాథను ప్రారంభిస్తున్నాడు.

అక్షౌహిణీ సంఖ్యావివరము.
సీ.
వరరథ మొక్కండు వారణ మొక్కండుతురగముల్మూఁడు కాల్వురును నేవు
రనుసంఖ్య గలయదియగుఁ బత్తి యదిత్రిగుణంబైనసేనాముఖంబు దీని
త్రిగుణంబు గుల్మంబు దీనిముమ్మడుఁ గగుగణముతద్గణముత్రిగుణిత మైన
వాహినియగు దానివడిమూఁటగుణియింపఁ బృతన నాబరఁగుఁదత్పృతనమూఁట
ఆ.
గుణితమైనఁ జము వగున్ మఱి దానిము,మ్ముఁగనీకినీసమాఖ్య నొనరు
నదియుఁ బదిమడుంగులైన నక్షౌహిణి, యౌ నిరంతర ప్రమానుసంఖ్య.80

ఈ మధ్యనే ఓ బ్లాగరి అక్షౌహిణీ సంఖ్యను గురించి వారి బ్లాగులో వ్రాసారు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు భటులు - బత్తి
౩ బత్తిలు ఒక సేనాముఖము
౩ సేనాముఖములు ఒక గుల్మము
౩ గుల్మములు ఒక గణము
౩ గణములు ఒక వాహిని
౩ వాహినులు ఒక పృతన
౩ పృతనలు ఒక చమువు
౩ చమువులు ఒక అనీకినీ సమాఖ్య
౧౦ అనీకినీ సమాఖ్యలు ఒక అక్షౌహిణి.
అంటే ఒక అక్షౌహిణికి ౨౧౮౭౦ రథములు, ౨౧౮౭౦ ఏనుగులు, ౬౫౬౧౦ గుఱ్ఱములు,
౧౦౯౩౫౦ మంది వీరభటులు గలది. ఇటువంటి ౧౮ అక్షౌహిణులు మహాభారత యుద్ధంలో
పాల్గొన్నాయి.అంటే మొత్తం ౩,౯౩,౬౬౦ రథములు, ౩,౯౩,౬౬౦ ఏనుగులు,
౧౧,౮౦,౯౮౦ గుఱ్ఱాలు, ౧౯,౬౮,౩౦౦ వీరభటులూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment